హైదరాబాద్: ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో మైదానంలో భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన చేష్టలకు గాను మ్యాచ్ రిఫరీ సమన్లు జారీ చేశాడు. ఈ సమన్లుపై మూడో రోజు ఆట ప్రారంభానికి ముందు విరాట్ కోహ్లీ మ్యాచ్ రిఫరీ జెఫ్ క్రౌయిని కలిసి వివరణ ఇచ్చాడు.
ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వివరాల్లోకి వెళితే... ఎడ్జ్బాస్టన్ టెస్ట్ తొలి రోజు ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ సమయంలో కొహ్లీ మెరుపు వేగంతో ఫీల్డింగ్ చేసి జో రూట్ను ఔట్ చేశాడు. రూట్ను రనౌట్ చేసిన ఆనందంలో మునుపెన్నడూ లేనంతలా సంబరాలు జరుపుకున్నాడు.
జో రూట్ పెవిలియన్కు వెళ్తోన్న సమయంలో విరాట్ కోహ్లీ ఫ్లయింగ్ కిస్లిస్తూ.. 'మైక్ డ్రాప్' సంబరాలు చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా మ్యాచ్ రిఫరీ కోహ్లీకి సమన్లు జారీ చేశాడు. ఈ నేపథ్యంలో మూడో రోజు ఆట ప్రారంభానికి ముందు కోహ్లీ మ్యాచ్ రిఫరీని కలిశాడు.
Was this @Schroders selection the turning point on Day 1?
— England Cricket (@englandcricket) August 1, 2018
Scorecard/Clips: https://t.co/E3ph4x4tRS#ENGvIND pic.twitter.com/0PUBMnewVA
వీరిద్దరి మధ్య కాసేపు సంభాషణ చోటు చేసుకుంది. స్కై స్పోర్ట్స్లో వస్తున్న వార్తల ప్రకారం ఓ జాతీయ జట్టుకు కెప్టెన్ అయిన నీవు మైదానంలో ఎలా ప్రవర్తించాలో తెలియదా? అంటూ మ్యాచ్ రిఫరీ కోహ్లీని మందలించినట్లు తెలుస్తోంది. అంతేకాదు మైదానంలో ఎలా ప్రవర్తించాలో కూడా కోహ్లీకి వివరించినట్లు పేర్కొంది.
మరోవైపు ఒకవేళ రిఫరీ.. కోహ్లీ క్రమశిక్షణ తప్పాడని నిర్ధారిస్తే.. మ్యాచ్ ముగిసిన తర్వాత.. శిక్షని ఖరారు చేసే అవకాశం ఉంది. అదే జరిగితే.. కోహ్లీ మ్యాచ్ ఫీజులో కోతతో పాటు అతని ఖాతాలో డీమెరిట్ పాయింట్లు చేరొచ్చు. అయితే.. ఏ లెవల్ కింద చర్యలు తీసుకుంటారు అనేది ఇక్కడ ముఖ్యం. ఒక్కోసారి వార్నింగ్తో కూడా సరిపెట్టవచ్చు.
ఇదిలా ఉంటే జూన్లో హెడింగ్లే వేదికగా జరిగిన మూడో వన్డేలో సెంచరీ సాధించి ఇంగ్లాండ్ను గెలిపించిన జో రూట్ ఇలానే మైక్ డ్రాప్ సంబరాలు చేసుకుని కోహ్లీని కవ్వించాడు. దీంతో.. కోహ్లీ తొలి టెస్టులో తాజాగా అతనికి బదులిచ్చాడు. అద్భుత ప్రదర్శన లేదా స్పీచ్ ఇచ్చినప్పుడు విజయానికి సంకేతంగా ఇలా 'మైక్ డ్రాప్' సంబరాలు చేసుకుంటారు.
NEVER MESS WITH INDIANS
— ѕтяιкєя вσу 🕶 (@vasanthvilliers) August 2, 2018
Then - Root
Now - Virat#ViratKohli 🔥#INDvENG pic.twitter.com/qODf7JvImB
కోహ్లీ 'మైక్ డ్రాప్' సంబరాలపై ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ స్పందించాడు. 'విరాట్ కోహ్లి మైక్ డ్రాప్ను మ్యాచ్ మధ్యలో నేను చూడలేదు. బుధవారం ఆట ముగిసిన తర్వాత.. రాత్రి చూశాను. ఆట మధ్యలో కోహ్లి ఇలా చమత్కరించడం.. టెస్టు క్రికెట్ వినోదాన్ని రెట్టింపు చేసింది' అని జో రూట్ వెల్లడించాడు.
ఇదిలా ఉంటే ఆతిథ్య ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో ఆరంభంలోనే అలెస్టర్ కుక్ వికెట్ కోల్పోయి ఇంగ్లాండ్ ఒత్తిడిలో పడింది. మూడోరోజైన శుక్రవారం 9/1 ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ను ఆరంభించిన ఇంగ్లాండ్ ఆరంభంలోనే మరో ఓపెనర్ కీటన్ జెన్నింగ్స్(8) వికెట్ కోల్పోయింది.