డ్యునెడిన్: సొంతగడ్డపై న్యూజిలాండ్ చెలరేగిపోతుంది. సిక్సర్ల వర్షం కురిసిన హైటెన్షన్ టీ20 మ్యాచ్లో కివీస్ మరోసారి ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. బుధవారం జరిగిన రెండో టీ20లో 4 పరుగుల తేడాతో విజయం సాధించిన న్యూజిలాండ్ సిరీస్లో 2-0తో ఆధిక్యంలో నిలిచింది.
తొలుత కివీస్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' మార్టిన్ గప్టిల్ (50 బంతుల్లో 97; 6 ఫోర్లు, 8 సిక్సర్లు) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (35 బంతుల్లో 53; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), జిమ్మీ నీషమ్ (16 బంతుల్లో 45 నాటౌట్; 1 ఫోర్, 6 సిక్సర్లు) చెలరేగారు. అనంతరం ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 8 వికెట్లకు 215 పరుగులు చేసింది.
చివరి 7 ఓవర్లలో 107 పరుగులు చేయాల్సిన దశలో జత కలిసిన స్టొయినిస్ (37 బంతుల్లో 78; 7 ఫోర్లు, 5 సిక్సర్లు), డాన్ స్యామ్స్ (15 బంతుల్లో 41; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగి 40 బంతుల్లోనే 92 పరుగులు జోడించారు. అయితే చివరి ఓవర్లో విజయానికి 15 పరుగులు అవసరం కాగా... వీరిద్దరు అవుట్ కావడంతో 10 పరుగులే వచ్చాయి.
ఈ మ్యాచ్లో కివీస్ బ్యాట్స్మన్ మార్టిన్ గప్టిల్ 8 సిక్సర్లు బాదడం ద్వారా భారత ఓపెనర్ రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టాడు. ఇప్పటి వరకు 96 టీ20లు ఆడిన గప్టిల్, 132 సిక్స్లు కొట్టి, పొట్టి ఫార్మాట్లో ప్రపంచంలోనే అత్యధిక సిక్స్లు బాదిన క్రికెటర్గా నిలిచాడు.
ఈ రికార్డు ఇంతకుముందు రోహిత్ శర్మ (108 మ్యాచ్ల్లో 127 సిక్స్లు) పేరిట ఉండేది. వీరి తర్వాత ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్(113 సిక్స్లు, 97 మ్యాచ్లు), న్యూజిలాండ్ ఆటగాడు కొలిన్ మున్రో(107), వెస్టిండీస్ ప్లేయర్ క్రిస్ గేల్(105 సిక్స్లు- 58 మ్యాచ్ల్లో) ఉన్నారు.