మెల్బోర్న్: అంతర్జాతీయ జట్టులో పాల్గొనని చాలా మంది భారత ఆటగాళ్లు తనకంటే టాలెంటెడ్ అని ఆస్ట్రేలియా క్రికెటర్ మార్కస్ స్టోయినిస్ అన్నాడు. భారత క్రికెట్లో ఉన్న టాలెంట్ మరేక్కడా లేదంటూ కొనియాడాడు. ఇంకా చాలా మంది క్రికెటర్లు భారత జాతీయ జట్టులో చోటు కోసం ఎదురుచూస్తుట్లు చెప్పాడు. అమెజాన్ ప్రైమ్ ద్వారా 'ది టెస్ట్' పేరుతో ఆస్ట్రేలియా జట్టుపై ఇటీవల విడుదల చేసిన డాక్యుమెంటరీలో స్టోయినిస్ పైవిధంగా స్పందించాడు.
'టీమిండియా వెలకట్టలేని ఆస్తి ధోనీ.. అతడిని మించి చూడాల్సిన అవసరం లేదు'
మార్కస్ స్టోయినిస్ 'ది టెస్ట్' డాక్యుమెంటరీలో భారత క్రికెట్ జట్టును ఆకాశానికెత్తేశాడు. 'భారతదేశం ప్రపంచంలోనే అత్యంత టాలెంట్ ఉన్న జట్టు. ఇప్పటికి భారత జాతీయ జట్టులో చోటు దక్కని క్రికెటర్లు నా కంటే ఎంతో టాలెంటెడ్. ఇప్పటికీ చాలా మంది క్రికెటర్లు భారత జాతీయ జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్నారు. భారత క్రికెట్లో ఉన్న టాలెంట్ మరేక్కడా లేదు' అని అన్నాడు.
'నాకు భారత్లో ఆడటం చాలా ఇష్టం. నేను భారతీయ సంస్కృతిని బాగా ఇష్టపడతా. ఆక్కడ ఎంతో ఉల్లాసంగా ఉంటారు. భారత్లో ఎంతో నైపుణ్యం ఉన్న క్రికెటర్లు ఉన్నారు. వరల్డ్లోనే భారత్ మోస్ట్ టాలెంటెడ్ జట్టు. ఆ జట్టులో ఉన్న టాలెంట్ను చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది' అని స్టోయినిస్ పేర్కొన్నాడు. 2018-19 పర్యటనలో ఆసీస్ గడ్డపై భారత్ టెస్ట్, వన్డే సిరీస్లను గెలుచుకుంది. దీంతో స్టోయినిస్ ఆలా రాసుకొచ్చాడు.
'ది టెస్ట్' డాక్యుమెంటరీ విడుదల సందర్భంగా ఆసీస్ హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ సైతం విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టుపై ప్రశంసలు కురిపించాడు. ఈ సందర్భంగా 2018-19 ఆసీస్ పర్యటనలో భారత్ సాధించిన అద్భుత విజయాలను లాంగర్ గుర్తు చేసుకున్నాడు. ప్రధానంగా భారత్తో జరిగిన ఆ టెస్టు సిరీస్ను తమకు గెలిచే అవకాశాలు వచ్చినా.. దాన్ని కోల్పోయామన్నాడు. భారత్ అద్భుతంగా ఆడిందన్నారు. ఆ పర్యటనలో ఆస్ట్రేలియాపై భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది.