
హైదరాబాద్: అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించిన ఓపెనర్ మన్జోత్ కల్రా అరుదైన ఘనత సాధించాడు. అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో సెంచరీ సాధించిన రెండో భారత క్రికెటర్గా నిలిచాడు. న్యూజిలాండ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన అండర్-19 వరల్డ్ కప్ పైనల్లో మన్జోత్ కల్రా (101 నాటౌట్) సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే.
అంతకముందు అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో సెంచరీ నమోదు చేసిన తొలి భారత ఆటగాడిగా ఉన్ముక్త్ చంద్ నిలిచాడు. 2012లో ఆస్ట్రేలియాతో జరిగిన అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో ఉన్ముక్త్ చంద్ 111 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు పైనల్లో భారత్ తరుపున మన్జోత్ కల్రా సెంచరీ నమోదు చేశాడు.
మొత్తంగా అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో సెంచరీ సాధించిన ఐదో ఆటగాడు మన్జోత్ కల్తా నిలిచాడు.1988 వరల్డ్ కప్ ఫైనల్లో ఆసీస్ ఆటగాడు బ్రెట్ విలియమ్స్ సెంచరీ సాధించి తొలి ఆటగాడిగా నిలవగా, 1998లో జరిగిన ఫైనల్లో ఇంగ్లాండ్ క్రికెటర్ స్టీఫెన్ పీటర్స్ సెంచరీ సాధించాడు.
ఇక, 2002లో జరిగిన అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా ఆటగాడు జారడ్ బర్క్ సెంచరీని సాధించాడు. తాజా ఫైనల్లో ఆస్ట్రేలియాపై పృథ్వీ షా నేతృత్వంలోని టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధఇంచింది. ఈ విజయంతో టీమిండియా నాలుగోసారి వరల్డ్ కప్ను గెలిచి చరిత్ర సృష్టించింది.
అంతకముందు 2000, 2008, 2012లలో టీమిండియా అండర్-19 వరల్డ్ కప్ విజేతగా అవతరించింది. 2000లో మహ్మద్ కైఫ్ కెప్టెన్సీలో, 2008లో విరాట్ కోహ్లి కెప్టెన్సీలో, 2012లో ఉన్ముక్త్ చంద్ కెప్టెన్సీలో భారత్ విశ్వవిజేతగా నిలిచింది. టోర్నీలో ఛాంపియన్ ప్రదర్శన కనబర్చిన అండర్-19 యువ జట్టుకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది.
కోచ్ రాహుల్ ద్రవిడ్కు రూ. 50 లక్షలు, ఒక్కో జట్టు సభ్యుడికి రూ. 30 లక్షలు, ఇక సపోర్టింగ్ స్టాఫ్కు రూ. 20 లక్షల చొప్పున నజరానా ప్రకటించింది.