నా బ్యాట్ని గర్ల్ఫ్రెండ్లా చూసుకుంటా:
మనీశ్ పాండే స్పైసీ పిచ్ తాజా ఎపిసోడ్లో పాల్గొని తన బ్యాట్లను గర్ల్ఫ్రెండ్స్తో పోల్చాడు. 'నా బ్యాట్ని గర్ల్ఫ్రెండ్లా చూసుకుంటాను. వాటిని బాగా చూసుకుంటా. నా బ్యాట్లతో అప్పుడప్పుడు గొడవ కూడా పడుతా. బంతి ఎడ్జ్ అయిన సమయంలో నా బ్యాట్తో మాట్లాడుతా. అవి కూడా నాకు సమాధానం ఇస్తాయి' అని మనీశ్ పాండే నవ్వుతూ అన్నాడు. పాండే 2008లో అండర్-19 మ్యాచులు ఆడాడు. ఆ సమయంలో విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలు కూడా జట్టులో ఉన్నారు. కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు ప్రపంచకప్ గెలుచుకున్న విషయం తెలిసిందే.
రియల్ లైఫ్లో ఒక్కటే బ్యాట్:
'నా బ్యాగ్లో ఎప్పుడూ ఐదుగురు గర్ల్ఫ్రెండ్స్ ఉంటారు. ప్రతి బ్యాట్ నాకు ప్రత్యేకమే. ఉదాహరణకి బ్యాగ్లోని ఓ బ్యాట్తో ఐపీఎల్లో మొదటి సెంచరీని నేను నమోదు చేశాను. దాన్ని ముద్దుగా 'షాడో బ్యాట్' అని పిలుస్తాను. నేను ఒత్తిడిలో ఉన్నప్పుడు, పెద్ద టోర్నీలకి సిద్ధమయ్యే సమయంలో ఆ బ్యాట్తోనే ప్రాక్టీస్ చేస్తాను. కానీ రియల్ లైఫ్లో ఒక్కటే బ్యాట్ (అశ్రిత)' అని మనీశ్ పాండే తెలిపాడు. సూపర్ పవర్ లాంటివి నమ్మను కానీ.. నేను ఒక బ్యాట్తో అసాధారణమైన ఇన్నింగ్ ఆడితే దాన్ని ఉపయోగిస్తూనే ఉంటానన్నాడు. అదృష్టంగా భావిస్తానని పేర్కొన్నాడు. బ్యాట్కు పగుళ్లు వచ్చినప్పుడు తనను గాయం అయినట్లుగా అనిపిస్తుందన్నాడు.
26 వన్డేలు, 38 టీ20లు:
మనీశ్ పాండే గత ఏడాది కాలంగా టీమిండియాలో నిలకడగా రాణిస్తున్నాడు. 2019 వన్డే ప్రపంచకప్కి అవకాశం దక్కించుకోలేకపోయిన పాండే.. దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారించి మళ్లీ భారత్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. అప్పటి నుండి బాగా ఆడుతున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుని కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతున్నాడు. పాండే ఇప్పటి వరకూ భారత్ తరఫున 26 వన్డేలు, 38 టీ20లు ఆడాడు. గత ఏడాది డిసెంబరులో నటి అశ్రిత షెట్టిని మనీశ్ పాండే వివాహం చేసుకున్నాడు.
గోల్డెన్ లెగ్:
టీమిండియాలో 'గోల్డెన్ లెగ్' అనే బిరుదు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి ఉంది. తాజాగా ఈ తరహా ప్రశంసలు మనీశ్ పాండేపై కూడా కురుస్తున్నాయి. 2018 నుంచి న్యూజిలాండ్తో జరిగిన ఐదో టీ20 వరకూ భారత్ తరఫున మనీశ్ పాండే 19 అంతర్జాతీయ టీ20 మ్యాచ్లు ఆడాడు. ఈ 19 టీ20 మ్యాచ్లలో టీమిండియానే విజయం సాధించింది. ఈ లెక్కలు చూస్తే.. టీమిండియాకు పాండే 'గోల్డెన్ లెగ్' అనొచ్చు.