కోహ్లీ ఒప్పుకోవాలి కదా
ఆసీస్తో పింక్ బాల్ టెస్టు ఆడాలంటూ ఇప్పటికే పలువురు మాజీలు సూచిస్తున్నారు. ఇదిలా ఉండగానే ఆసీస్ టెస్టు కెప్టెన్ టిమ్ పైన్కు ఇదే ప్రశ్న ఎదురైంది. పాకిస్తాన్తో జరిగిన తొలి టెస్టు తర్వాత పైన్ను భారత్తో పింక్ బాల్ టెస్టు గురించి ఒక జర్నలిస్టు ప్రశ్నించాడు. 'భారత్తో పింక్ బాల్ టెస్టు ఆడటానికి సిద్ధంగా ఉన్నారా' అని అడిగాడు. 'మేము సిద్ధమే. అయితే కోహ్లీ ఒప్పుకోవాలి కదా. ఒకవేళ అతడు మంచి మూడ్లో ఉంటే ఒప్పుకుంటాడు. పింక్ బాల్ టెస్టు జరుగుతుంది' అని పైన్ సమాధానం ఇచ్చాడు.
భారత్తో పింక్ టెస్టు ఆడాలనుకుంటున్నాం
'మేము పింక్ బాల్ టెస్టును భారత్తో ఆడటానికి యత్నించాం. మళ్లీ ప్రయత్నిస్తాం కూడా. అవసరమైతే కోహ్లీ నిర్ణయం కోసం పరుగెడతాం. ఏదొక రోజు పింక్ బాల్ టెస్టు మ్యాచ్కు మేము ఊహించిన సమాధానాన్ని అందుకుంటాం. అది కచ్చితంగా జరుగుతుంది.ఎప్పుడ్నుంచో భారత్తో పింక్ టెస్టు ఆడాలనుకుంటున్నాం. కానీ కోహ్లీ అందుకు సిద్ధంగా లేడు. ఇప్పుడు భారత్ పింక్ బాల్ టెస్టు ఆడింది కాబట్టి తమతో వచ్చే సమ్మర్లో పింక్ బాల్ టెస్టు ఉంటుందనే అనుకుంటున్నా' అని పైన్ ధీమా వ్యక్తం చేసాడు.
గంగూలీ చొరవ
గత ఏడాది అడిలైడ్లో భారత్తో పింక్ బాల్ మ్యాచ్ కోసం ఆసీస్ చేసిన ప్రయత్నం ఫలించలేదు. పింక్ బాల్తో మ్యాచ్కు కోహ్లీ నో చెప్పడంతో అది జరగలేదు. కాగా, ఇప్పుడు సౌరవ్ గంగూలీ చొరవతో తొలి పింక్ టెస్ట్ జరిగింది. టీమిండియా పింక్ బాల్ టెస్టులకు ఆసక్తి చూపుతూ ఉండటంతో ఆసీస్కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. మాతో పింక్ టెస్ట్ ఆడాలని ఇప్పటికే షేన్ వార్న్ అన్న విషయం తెలిసిందే.
సిరీస్ క్లీన్స్వీప్
రెండో టెస్ట్ విజయంతో సిరీస్ను భారత్ 2-0తో క్లీన్స్వీప్ చేసింది. అంతకు ముందు జరిగిన టీ 20 సిరీస్ను రోహిత్ శర్మ సారథ్యంలో 2-1తో గెలిచింది. భారత్ వరుస విజయాలతో దూసుకుపోతుండడంతో కోహ్లీ మాంచి జోష్లో ఉన్నాడు. ఈ గెలుపుతో కోహ్లీసేన టెస్టుల్లో 12వ విజయాన్ని నమోదు చేసింది. అంతేకాదు, వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ పట్టికలో అగ్ర స్థానంలో నిలిచింది.