
హైదరాబాద్: టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్కు దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చాడు. ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ పరుగుల సునామీ సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. విభిన్న పిచ్లు, భిన్న పరిస్థితుల్లో ఒకే తరహా ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
తాజాగా, మంగళవారం బర్మింగ్హామ్ వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో రోహిత్ శర్మ 92 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సుల సాయంతో 104 పరుగులు చేసి ఔటైన సంగతి తెలిసిందే. దీంతో ఈ ప్రపంచకప్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ అగ్రస్థానంలో నిలిచాడు.
ఇప్పటివరకు 516 పరుగులతో అగ్రస్థానంలో ఉన్న డేవిడ్ వార్నర్ను రోహిత్ శర్మ వెనక్కినెట్టాడు. ఈ నేపథ్యంలో యువరాజ్ సింగ్ తన ట్విట్టర్లో "రోహిత్ శర్మ ఐసీసీ మ్యాన్ ఆఫ్ ద సిరిస్ ట్రోఫీకి దగ్గరవుతున్నాడు. ప్రపంచకప్లో నాలుగో సెంచరీ. చాలా చక్కగా ఆడావు ఛాంపియన్" అంటూ రోహిత్ శర్మను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు.
అయితే, యువరాజ్ సింగ్ ట్వీట్కు కెవిన్ పీటర్సన్ "ఇంగ్లాండ్ ప్రపంచకప్ గెలవకపోతే, పై-చుకర్" అంటూ కామెంట్ పెట్టాడు. పీటర్సన్ ట్వీట్కు యువరాజ్ సింగ్ అదిరిపోయే సమాధానమిచ్చాడు. "ముందు సెమీస్కు క్వాలిపై అయి ఆ తర్వాత గెలుపు గురించి మాట్లాడు. నేను మాట్లాడేది మ్యాన్ ఆఫ్ ద సిరిస్ ట్రోఫీ గురించి.... ప్రపంచకప్ గెలవడం గురించి కాదు" అంటూ ట్వీట్ చేశాడు.
ఇదిలా ఉంటే, బంగ్లాపై సెంచరీ సాధించడంతో ఒక వరల్డ్కప్లో ఐదు వందలకు పైగా పరుగులు సాధించిన రెండో భారత ఆటగాడిగా రోహిత్ గుర్తింపు పొందాడు. ఈ ప్రపంచకప్లో రోహిత్ శర్మకు ఇది నాలుగో సెంచరీ కాగా... మొత్తంగా 26వ సెంచరీ కావడం విశేషం. తద్వారా ప్రపంచకప్లో అత్యధిక సెంచరీలు సాధించిన శ్రీలంక మాజీ క్రికెట్ దిగ్గజం కుమార్ సంగక్కర(4 సెంచరీలు) రికార్డుని రోహిత్ శర్మ సమం చేశాడు.
ఇప్పుడు బంగ్లాపై సెంచరీతో చెలరేగాడు. షకీబ్ వేసిన 29వ ఓవర్ ఆఖరి బంతికి సింగిల్ తీసి సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్.. సెంచరీ అనంతరం దూకుడుగా ఆడే క్రమంలో రోహిత్ శర్మ 92 బంతుల్లో 104(7 ఫోర్లు, 5 సిక్సులు) సౌమ్య సర్కార్ బౌలింగ్లో లిట్టన్ దాస్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. దీంతో జట్టు స్కోరు 180 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది.
ఇది వరల్డ్కప్లో టీమిండియాకు అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం కావడం విశేషం. అంతకముందు రోహిత్ శర్మ-శిఖర్ ధావన్లు 174 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యం సాధించారు. 2015 వరల్డ్కప్లో ధావన్తో కలిసి రోహిత్ ఈ ఘనత సాధించాడు. ఇప్పుడు ఆ రికార్డుని రోహిత్-రాహుల్లు బద్దలు కొట్టారు. రెండు ఓపెనింగ్ భాగస్వామ్యాల్లో రోహిత్ ఉండటం విశేషం.
ప్రపంచకప్ టోర్నీలో భారత్కు అత్యుత్తమ భాగస్వామ్యాలు ఇవే..:
180 రోహిత్-రాహుల్- బంగ్లాదేశ్(2019)
174 రోహిత్-ధావన్- ఐర్లాండ్(2015)
163 అజయ్ జడేజా-సచిన్ టెండూల్కర్-కెన్యా(1996)
153 సచిన్-సెహ్వాగ్-శ్రీలంక(2003)