
హైదరాబాద్: టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షాను ఒంటరిగా వదిలేయాలని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి విజ్ఞప్తి చేశాడు. హైదరాబాద్ వేదికగా శుక్రవారం నుంచి రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడాడు.
"యువ ఆటగాడైన పృథ్వీ షాకు ఎదిగే సమయం ఇవ్వండి. అతను అద్భుత నైపుణ్యం గల ఆటగాడు. అతని సామర్థ్యాన్ని ప్రతి ఒక్కరు చూశారు. షా గొప్పగా ఆడుతాడని మేం భావిస్తున్నాం. తొలి మ్యాచ్ ఆటను పునరావృతం చేస్తాడని నమ్ముతున్నాం. అతనో నిత్య విద్యార్థి. పరిస్థితులను చాలా అద్బుతంగా అర్థం చేసుకుంటాడు" అని కోహ్లీ చెప్పాడు.
"వారికొచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. కానీ దేశం కోసం ఆడేటప్పుడు ప్రతి ఒక్కరూ ఒత్తిడికి లోనవుతారు. జెర్సీ వేసుకోగానే బాధ్యత పెరుగుతుంది. మొదటి సారి టీమిండియా క్యాప్ పెట్టుకోగానే ఎంతో సంతోషంగా ఉటుంది. కానీ దానిక వెనక ఒత్తిడి కూడా అదే స్థాయిలో ఉంటుంది. మొదటి సారి అంతర్జాతీయ స్థాయిలో మ్యాచ్లు ఆడుతున్నారంటే ఎవరికయినా ఒకరకమైన భయం ఉంటుంది" అని కోహ్లీ చెప్పాడు.
"అతడి ప్రదర్శన పట్ల మేం చాలా సంతోషంగా ఉన్నాం. మనం ఇప్పుడే అతన్ని ఎవరితో పొల్చొద్దు. అతని ఆటను ఆస్వాదిస్తూ ఆడే అవకాశం కల్పించాలి. అలా అయితే తన సహజశైలి ఆటతో ఎదుగుతాడు. ఐపీఎల్, ఇండియా-ఏ పర్యటనలు, అండర్ 19 టోర్నీ లైవ్ కవరేజిలతో యువ ఆటగాళ్లకు వెలుగులోకి వస్తున్నారు" అని కోహ్లీ అన్నాడు.
"ఇవి వారిని ఒత్తిడి జయించేలా చేస్తున్నాయి. చాలా మంది ప్రేక్షకుల ముందు ఐపీఎల్ ఆడిన ఆటగాళ్లకు ఎలాంటి సమస్య ఉండదు. పృథ్వీ షా, హనుమ విహారి ఇలానే అద్బుతంగా రాణించారు. వారి ఆటపట్ల వారు చాలా నమ్మకంగా ఉన్నారు" అని యువ ఆటగాళ్లపై కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు.
కాగా, రాజ్కోట్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన తొలి టెస్ట్లో పృథ్వీషా అరంగేట్ర మ్యాచ్లోనే సెంచరీ సాధించి రికార్డు సృష్టించి సంగతి తెలిసిందే. దీంతో అతడి ఆటను సచిన్, సెహ్వాగ్లతో పోల్చుతూ అభిమానులు, మాజీ క్రికెటర్లు ప్రశంసల జల్లు కురిపించారు. అయితే ఇప్పుడే పృథ్వీ షాను దిగ్గజ క్రికెటర్లతో పోల్చవద్దని గంగూలీ, గంభీర్లు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.