KXIP vs MI: వాట్ ఏ క్యాచ్.. మ్యాక్స్వెల్-నీషమ్ కలిసి పట్టారు.. రోహిత్ను ఔట్ చేశారు!!

అబుదాబి: ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ (70: 45 బంతుల్లో 8ఫోర్లు, 3సిక్సర్లు) మరోసారి అద్భుత ప్రదర్శనతో అదరగొట్టాడు. గురువారం రాత్రి కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో అర్ధ శతకంతో రాణించడంతో ముంబై నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లకు 191 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ చివరలో హార్దిక్ పాండ్యా (30 నాటౌట్: 11 బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సర్లు ), కీరన్ పొలార్డ్ (47 నాటౌట్: 20 బంతుల్లో 3ఫోర్లు, 4సిక్సర్లు ) మెరుపు బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా పొలార్డ్ హ్యాట్రిక్ ఫోర్లు, సిక్సులతో వీరవిహారం చేశాడు. అయితే ఈ మ్యాచ్లో పంజాబ్ ప్లేయర్స్ అద్భుత ఫీల్డింగ్తో ఆకట్టుకున్నారు.

షమీ సూపర్ త్రో:
మొదటగా పంజాబ్ పేసర్ మొహ్మద్ షమీ అద్భుత త్రో విసిరి కీలక బ్యాట్స్మన్ను పెవిలియన్ చేర్చాడు. స్పిన్నర్ రవి బిష్ణోయ్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో సూర్య కుమార్ యాదవ్ ను రోహిత్ శర్మ అనవసర పరుగు కోసం పిలిచాడు. నాన్ స్ట్రైక్ ఎండ్ నుంచి సూర్యకుమార్ పరిగెత్తుకుంటూ క్రీజూలోకి వచ్చేలోపే.. బంతిని అందుకున్న షమీ డైరెక్ట్ త్రోతో వికెట్లను గిరాటేశాడు. దీంతో సూర్యకుమార్ (10) నిరాశగా పెవిలియన్ చేరాడు. అప్పటికి ముంబై స్కోర్ 21 మాత్రమే. మొత్తానికి షమీ విసిరిన డైరెక్ట్ త్రోకు వికెట్ల మధ్య నిర్లక్ష్యంగా పరుగెత్తిన సూర్యకుమార్ బలయ్యాడు.

వాట్ ఏ క్యాచ్ మ్యాక్స్వెల్:
మొహ్మద్ షమీ వేసిన 17 ఓవర్లో గ్లెన్ మ్యాక్స్వెల్, జేమ్స్ నీషమ్ స్టన్నింగ్ క్యాచ్ పట్టారు. 17వ ఓవర్ తొలి బంతిని రోహిత్ శర్మ లాంగ్ ఆఫ్ దిశగా భారీ షాట్ ఆడాడు. అందరూ సిక్స్ ఖాయం అనుకున్నారు. కానీ బౌండరీ లైన్ దగ్గరున్న మ్యాక్స్వెల్ పరిగెత్తుకుంటూ వచ్చి బంతిని అందుకున్నాడు. అయితే బ్యాలెన్స్ కోల్పోయి బౌండరీ లైన్ దాటుతున్న సమయంలో.. చేతిలో ఉన్న బంతిని పక్కనే ఉన్న నీషమ్ వైపు విసిరాడు. ఆపై మ్యాక్స్వెల్ బౌండరీ లైన్ దాటగా.. బంతిని నీషమ్ అందుకున్నాడు. దీంతో రోహిత్ ఔటయ్యాడు. ప్రస్తుతం మ్యాక్స్వెల్ పట్టిన క్యాచ్కు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

రోహిత్ 38వ హాఫ్ సెంచరీ:
కీలక వికెట్లు కోల్పోయిన సమయంలో రోహిత్ శర్మ అద్భుతంగా ఆడాడు. స్వల్ప స్కోరుకే ముంబై రెండు వికెట్లు కోల్పోవడంతో రోహిత్ వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ ఇన్నింగ్స్ను ముందుండి నడిపించాడు. రోహిత్ 40 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో అర్ధ శతకం సాధించాడు. జేమ్స్ నీషమ్ వేసిన 16వ ఓవర్ రెండో బంతికి ఫోర్ కొట్టి 50 మార్క్ చేరుకున్నాడు. ఐపీఎల్లో అతనికిది 38వ హాఫ్ సెంచరీ కావడం విశేషం. ఒత్తిడిలోనూ రోహిత్ విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ఐపీఎల్లో రోహిత్ అరుదైన రికార్డు కూడా నెలకొల్పాడు. ఐపీఎల్లో రోహిత్ 5000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఈ మ్యాచ్లో ఎదుర్కొన్న తొలి బంతినే బౌండరీకి తరలించిన రోహిత్.. 5 వేల పరుగుల క్లబ్లో చేరాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications