హైదరాబాద్: పంజాబ్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఐపీఎల్లో భాగంగా ఇండోర్లోని హోల్కర్ స్టేడియం వేదికగా జరిగిన బెంగళూరు, పంజాబ్ మ్యాచ్లో పంజాబ్ వంద పరుగులు కూడా చేయలేకపోయింది. దీంతో ఆ జట్టును బెంగళూరు కేవలం 49బంతుల్లోనే ఓడించగలిగింది. ఇలాగే జరగడం పంజాబ్ జట్టుకు కొత్తేం కాదు. ఎలాగంటే గతేడాది, ఇప్పుడు జరిగిన రెండు మ్యాచ్ల్లోనూ పంజాబ్ ఘోర పరాజయాన్ని నమోదు చేసుకుంది.
అంతేకాదు, ఈ రెండు మ్యాచ్ల్లోనూ పంజాబ్ స్వల్ప స్కోర్లకే పరిమితమై ఓటమికి గురవడం గమనించదగ్గ విషయం. 2017 మే 14న ఆడిన మ్యాచ్లో పంజాబ్ స్కోరు ఇప్పటికంటే తక్కువే. అప్పుడు కూడా టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పంజాబ్ 73పరుగులు మాత్రమే చేసింది. ప్రత్యర్థి జట్టు అయిన సూపర్ జెయింట్స్ 12ఓవర్లు ఆడి 78 పరుగులతో 9వికెట్ల ఆధిక్యంతో మ్యాచ్ గెలిచింది. అప్పుడు ఓపెనర్లు మార్టిన్ గప్తిల్ డకౌట్ అవ్వగా, మరో ఓపెనర్ సాహా 13 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్లో అక్షర్ పటేల్ (22పరుగులు 26 బంతుల్లో)దే అత్యధిక వ్యక్తిగత స్కోరు.
ఆదివారం జరిగిన మ్యాచ్లో అరోన్ ఫించ్దే అత్యధిక వ్యక్తిగత స్కోరు. 23 బంతుల్లో 26 పరుగులు చేశాడు. దీంతో మే 14వ తేదీ పంజాబ్కు కలిసిరాదని పలువురు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 15.1 ఓవర్లలో 88 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బెంగళూరు లక్ష్యాన్ని ఛేదించి విజయం సొంతం చేసుకుంది.
తాజా పరాజయంతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి పడిపోయింది. టోర్నీలో భాగంగా తదుపరి మ్యాచ్లో పంజాబ్.. ముంబై ఇండియన్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్ నుంచి ప్రతి మ్యాచ్ గెలిస్తేనే ప్లేఆఫ్కు వెళ్లేందుకు పంజాబ్ జట్టుకు మార్గం సుగమం అవుతుంది.