టీమిండియా జట్టులోని ఆటగాళ్లు ..
లాక్డౌన్ను సడలించినా అంతర్ రాష్ట్ర ప్రయాణాలపై ఇప్పటికీ ఆంక్షలు కొనసాగుతుండటంతో.. ఒకే చోట శిక్షణ శిబిరం నిర్వహించేందుకు బీసీసీఐకి వీలు లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో సొంత రాష్ట్రాల్లోని మైదానాల్లో వ్యక్తిగతంగా సాధన చేయాలని భారత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ ఆటగాళ్లకు సూచించారు. దీంతో టీమిండియా జట్టులోని కొందరు ఆటగాళ్లు సాధన మొదలెట్టారు. కుల్దీప్ కూడా చిన్ననాటి కోచ్ కపిల్ పాండే నేతృత్వంలో స్థానిక రోవర్స్ మైదానంలో వారం రోజుల నుంచి సాధన చేస్తున్నాడు.
శారీరకంగా కష్టపడుతున్నాను
తాజాగా కుల్దీప్ యాదవ్ మాట్లాడుతూ... 'లాల్బంగ్లా ప్రాంతంలోని రోవర్స్ మైదానంలో సాధన ఆరంభించాను. నిజానికి రోజుకు రెండు సెషన్లు శ్రమిస్తున్నాను. ఉదయం 7:30-9:00 మధ్య శారీరకంగా కష్టపడుతున్నాను. ఆ తర్వాత ఇంటికి వెళ్లి సాయంత్రం 4:00-8:00 గంటల వరకు క్రమం తప్పకుండా నెట్స్లో బౌలింగ్ చేస్తున్నాను' అని అన్నాడు.
వారాల్లో ఫిట్నెస్ సాధిస్తా..
'వారం రోజుల్నుంచి ఔట్డోర్లో సాధన చేస్తున్నా. శిక్షణ పూర్తవ్వగానే ఇంటికెళ్లి భౌతిక దూరం పాటిస్తున్నా. అంతర్జాతీయ క్రికెట్ ఆరంభమైతే కొన్ని వారాల్లో ఫిట్నెస్ సాధిస్తానన్న నమ్మకముంది. బాల్యం నుంచి ఉమ్మితో బంతిని రుద్దడం అలవాటైంది. ఐసీసీ కొత్త నిబంధనలతో దానికి అలవాటు పడేందుకు ప్రయత్నిస్తున్నా. శిక్షణ శిబిరాల్లోనే ఇది అలవాటవ్వాలి. ఉమ్మి బదులు ఏదైనా ప్రత్యామ్నాయం ఉంటుందనే అనుకుంటున్నా' అని కుల్దీప్ పేర్కొన్నాడు.
కరోనాతో బాధపడుతున్న సమయంలో
దేశం మొత్తం కరోనాతో బాధపడుతున్న సమయంలో క్రికెట్ గురించే ఆలోచించడం సరికాదని కుల్దీప్ యాదవ్ అంటున్నాడు. 'దేశవ్యాప్తంగా వలస జీవులు ఎంత బాధ అనుభవించారో మనం చూశాం. ఢిల్లీ, ముంబైలో అయితే ఎంతో నరకాన్ని అనుభవించారు. ప్రజలు జీవనాధారం కోల్పోయారు. ఇలాంటి సమయంలో క్రీడల గురించి ఆలోచించలేం. తరచుగా దానధర్మాలు చేస్తుండాలని నేను నమ్ముతా. ఒక స్వచ్ఛంద సంస్థతో నాకు అనుబంధం ఉంది. దాని సాయంతో నా స్వస్థలమైన కాన్పూర్లో ప్రజలకు సహాయం చేస్తుంటా' అని కుల్దీప్ చెప్పుకొచ్చాడు.