ధోనీని మిస్ అవుతున్నా:
కుల్దీప్ యాదవ్ గురువారం పీటీఐతో మాట్లాడుతూ... ' ఎంఎస్ ధోనీని మిస్ అవుతున్నా. మహీలాంటి అనుభవం గల ఆటగాడు భారత జట్టుకు ఇప్పటికీ అవసరం. అతను జట్టు కోసం ఎంతో చేశాడు' అని అన్నాడు. 'టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి అరంగేట్రం నుంచి నాకు అండగా ఉన్నాడు. అన్ని విషయాల్లో సహకరించాడు. పరిస్థితులను బట్టి జట్టు యాజమాన్యం ఎవరిని ఆడించాలనే విషయాన్ని నిర్ణయిస్తుంది' అని పేర్కొన్నాడు.
ఐపీఎల్ చాలా ముఖ్యం:
'ఐపీఎల్లో పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఆటగాళ్లు చురుకుదనంతో మెలగాలి. ప్రస్తుతం మెగా ఈవెంట్ కోసం నేను సిద్ధంగా ఉన్నా. ఈసారి నా ప్రణాళికలకు తగినంత సమయం దొరికింది. టీ20 ప్రపంచకప్లో చోటు సంపాదించాలంటే.. ఐపీఎల్ చాలా ముఖ్యం. ప్రతి ఆటగాడు ఎక్కువ మ్యాచ్లు ఆడాలనుకుంటాడు. ఎంత ఎక్కువ ఆడితే అంత మెరుగవుతారు. నెలన్నర పాటు ఆడే వేదిక ఐపీఎల్. అక్కడి ప్రదర్శనలే ఆటగాళ్లకు ప్రతిఫలాన్నిస్తాయి' అని మణికట్టు మాంత్రికుడు చెప్పాడు.
కఠిన పరిస్థితుల్లో తిరిగి పుంజుకోవాలి:
'క్రికెట్ ఒక్క రోజు ఆడే ఆట కాదు. ప్రతి ఒక్క ప్లేయర్ కఠిన పరిస్థితులను ఎదుర్కొంటాడు. ఏ క్రికెటర్కైనా మంచితో పాటు చెడ్డ రోజులు ఎదురౌతాయి. కఠిన పరిస్థితులలో కూడా ఆటగాళ్లు తిరిగి పుంజుకోవాలి. భారత జట్టులో తన వైఫల్యానికి కారణాలేవీ లేవు. పరిస్థితులకు అనుగుణంగా జట్టు కాంబినేషన్ ఉంటుంది. న్యూజిలాండ్ పిచ్లు ప్రత్యేకంగా ఉన్నాయి. అక్కడి టెస్టు పిచ్లు స్పిన్ ట్రాక్లు కావు. టెస్టు సిరీస్ కూడా చిన్నది' అని చెప్పుకొచ్చాడు.
జడేజా గట్టి పోటీ ఇస్తున్నాడు:
'రవీంద్ర జడేజా గట్టి పోటీ ఇస్తున్నాడు. బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్ విభాగాల్లో బాగా రాణిస్తున్నాడు. జడ్డూ రాకతో జట్టులో పోటీతత్వం పెరిగింది. అక్టోబర్లో జరిగే టీ20 ప్రపంచకప్లో అతనితో కలిసి ఆడాలనుకుంటున్నా. కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ వికెట్ల వెనుక బాగా ఆడుతున్నారు' అని కుల్దీప్ అన్నాడు. 'భారత మహిళల జట్టు టీ20 ప్రపంచకప్లో గ్రూప్ దశలో బాగా ఆడింది. ఫైనల్లో హర్మన్ప్రీత్ సేన కప్పుతో తిరిగొస్తుంది' అని ధీమా వ్యక్తం చేసాడు.