ధోనీ ఉంటే చాలు:
తాజాగా ఈఎస్పీఎన్ క్రిక్బాజీ కార్యక్రమంలో కుల్దీప్ యాదవ్ మాట్లాడుతూ... 'కెరీర్ ఆరంభంలో పిచ్లను అధ్యయనం చేయడం నాకంతగా రాదు. ఎంఎస్ ధోనీతో కలిసి ఆడటం ఆరంభించాకే నాకీ విషయంలో అనుభవం వచ్చింది. బంతిని ఎప్పుడు స్పిన్ చేయాలో, ఎక్కడ పిచ్ చేయాలో అతడు తరుచూ చెప్తుండేవాడు. మైదానంలో ఫీల్డర్లను మోహరించడంలో ధోనీ సిద్ధహస్తుడు. అందుకే అతడు కీపింగ్ చేస్తుంటే.. నేనెప్పుడూ ఫీల్డింగ్ పొజిషన్ల గురించి పట్టించుకోను' అని తెలిపాడు.
చాలా మిస్ అవుతున్నా:
'నా బౌలింగ్లో బ్యాట్స్మెన్ ఎలా ఆడతారో అర్థంచేసుకొని అందుకు అనుగుణంగా మహీ భాయ్ ఫీల్డర్లను మోహరిస్తాడు. నాకు ఒక్కడికే కాదు.. జట్టులోని అందరికి ఇలానే చేస్తాడు. బ్యాట్స్మన్ భారీగా పరుగులు చేస్తున్నపుడు.. ఎలా బౌలింగ్ చేయాలో సలహాలు ఇస్తాడు. బ్యాట్స్మన్ కదలికలను బట్టి బంతి వేయమని చెప్పేవాడు. మహీ భాయ్ సలహాలు చాలా సక్సెస్ అయ్యాయి. మహీ మైదానంలో ఉంటే ఎంతో ఆత్మవిశ్వాసంగా అనిపిస్తుంది. ఏడాదిగా వన్డేల్లో అతడు కొనసాగకపోవడంతో లోటు కనిపిస్తోంది' అని మణికట్టు స్పిన్నర్ చెప్పాడు.
ఇప్పుడు బెంగలేదు:
'నాకు ఏబీ డివిలియర్స్కు బౌలింగ్ చేయడమంటే కత్తిమీద సాములా ఉండేది. నన్ను అత్యంత భయపెట్టిన బ్యాట్స్మన్ అతడు. నా బౌలింగ్లో ఎదురుదాడి చేసి భారీగా పరుగులు సాధించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అది అంతర్జాతీయ క్రికెట్లో కావచ్చు లేదా ఐపీఎల్ కావొచ్చు. డివిలియర్స్ రిటైర్ అయిపోయాడు కాబట్టి బెంగలేదు కానీ.. లేదంటే నా లాంటి బౌలర్లు ఎంతోమంది బలయ్యేవారు. నేను కూడా మరోసారి అతడికి బాధితుడిని అయ్యేవాడినేమో' అని కుల్దీప్ పేర్కొన్నాడు.
మూడు ఫార్మాట్లలో 167 వికెట్లు:
టెస్టుల్లో ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ చాలెంజింగ్గా ఉంటుందని ణికట్టు మాంత్రికుడు కుల్దీప్ యాదవ్ తెలిపాడు. ఎక్కవ బ్యాక్ ఫుట్లో ఆడటమే కాకుండా చాలా ఆలస్యంగా బంతిని ఆడటం తనకు సవాల్గా ఉండేదన్నాడు. కుల్దీప్ భారత్ తరపున 6 టెస్టులు, 60 వన్డేలు, 21 టీ20లు ఆడాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 167 వికెట్లు పడగొట్టాడు.