కొలంబో: శ్రీలంకలో పర్యటిస్తోన్న భారత క్రికెట్ జట్టులో సభ్యుడైన స్పిన్నర్ కృనాల్ పాండ్యా.. ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి బారిన పడటం దుమారం రేపుతోంది. టీమిండియా ప్లేయర్లలో తొమ్మిది మందిని జట్టుకు దూరంగా పెట్టింది. కొత్త ప్లేయర్లు, జూనియర్లతో శ్రీలంక జట్టును ఢీ కొట్టాల్సిన పరిస్థితిని కల్పించింది. ఈ రాత్రికి రెండో టీ20లో శ్రీలంక జట్టును ఢీ కొట్టబోయే టీమిండియాలో ఒకరిద్దరు మినహా మిగిలిన వారందరూ ఇంటర్నేషనల్ మ్యాచ్లకు దాదాపు కొత్తవారే. ఈ కొత్త జట్టుకు బౌలర్ భువనేశ్వర్ కుమార్ కేప్టెన్గా ప్రమోట్ అయ్యాడు.
కాగా- దీనికంతటికీ మూలకారణమైన కృనాల్ పాండ్యా ప్రస్తుతం టీమిండియా జట్టు నుంచి విడిపోయాడు. అతణ్ని మరో హోటల్కు తరలించారు. ప్రస్తుతం జట్టు బస చేసిన కొలంబోలోని తాజ్ సముద్ర నుంచి హోటల్ మౌంట్ లావీనియాకు అతణ్ని షిప్ట్ చేశారు.
అక్కడే అతను డాక్టర్ల పర్యవేక్షణలో కొనసాగనున్నాడు. క్వారంటైన్ కోసం ప్రత్యేకంగా రెండు గదులను అద్దెకు తీసుకున్నారు. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ కమిటీ వెల్లడించింది. మొదట్లో టీమిండియా కొలంబోలోని తాజ్ సముద్రలో బస చేసింది. ఇఫ్పుడు కూడా జట్టు మొత్తం అదే హోటల్లోనే కొనసాగుతుందని శ్రీలంక క్రికెట్ కమిటీ పేర్కొంది.
కరోనా వైరస్ బారిన పడిన కృనాల్ పాండ్యాను మౌంట్ లావీనియాకు తరలించినట్లు స్పష్టం చేసింది. డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నాడని, ప్రతి రోజూ అతనికి ఆర్టీపీసీఆర్ ద్వారా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను నిర్వహిస్తామని తెలిపింది.
త్వరలోనే పాండ్యా సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తాడని ఆశిస్తున్నట్లు పేర్కొంది. కాగా- కృనాల్ పాండ్యాతో సన్నిహితంగా గడిపిన ఎనిమిదిమంది క్రికెటర్లు ప్రస్తుతం ఐసొలేషన్లో ఉన్నారని, దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని త్వరలోనే తెలియజేస్తామని శ్రీలంక క్రికెట్ కమిటీ తెలిపింది. కృనాల్ ఎలా వైరస్ బారిన పడ్డాడనే విషయంపై ఆరా తీస్తున్నట్లు స్పష్టం చేసింది.