మరో దారి లేదు
శ్రీలంకతో సిరీస్లో మాత్రం తనకు ప్రత్యేకంగా బౌన్సీ పిచ్లే కావాలని కెప్టెన్ కోహ్లీ చెప్పాడు. భారత్-శ్రీలంక జట్ల మధ్య నాగ్పూర్ వేదికగా శుక్రవారం నుంచి రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ కోల్కతా పిచ్ని మనం ఇప్పటికే చూశాం, ఇప్పుడు నాగ్పూర్లోనూ అలాంటి పిచ్ ఉందని అన్నాడు. దీంతో ఎందుకిలా? మీరే బౌన్సీ పిచ్లు తయారు చేయమని అడిగారా? అని కోహ్లీని ప్రశ్నించగా అతను నేరుగానే సమాధానమిచ్చాడు. 'అవును. ఎందుకంటే మాకు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లడానికి ఎక్కువ సమయం లేదు. ఈ సిరీస్ ముగిసిన తర్వాత రెండు రోజులకే దక్షిణాఫ్రికా ఫ్లయిటెక్కాల్సి ఉంది. దీంతో మాకు ఉన్న ఈ ఒక్క అవకాశం వాడుకోవడం తప్ప మరో దారి లేదు' అని కోహ్లీ అన్నాడు.
ఇచ్చిన సమయంలోనే సన్నద్ధం కావాల్సిన పరిస్థితి
'కనీసం ఓ నెల గడువు దొరికినట్టయితే.. మేం సరిగ్గా ఈ పర్యటనకు సన్నద్ధమై ఉండేవాళ్లం. కానీ ఇప్పుడు మాకు ఇచ్చిన సమయంలోనే సన్నద్ధం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. సహజంగా విదేశీ పర్యటనలు అంటే జట్టు తగినంతగా సన్నద్ధం కావడానికి సమయం ఇస్తారు. కానీ ఇప్పుడు మాకు ప్రిపరేషన్ కోసం ఎన్ని రోజులు ఉన్నాయో తెలియని పరిస్థితి' అని కోహ్లీ అసహనం వ్యక్తం చేశాడు. డిసెంబర్ 24తో శ్రీలంతో మూడు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20ల సిరిస్ ముగియనుంది. ఆ తర్వాత రెండు రోజులకే డిసెంబర్ 27న కోహ్లీసేన దక్షిణాఫ్రికా పర్యటనకు బయల్దేరనుంది. దీంతో సిరీస్కు సిరీస్కు మధ్య కనీసం కొంతైన సమయం ఉండేలా షెడ్యూల్ ఉండాలని కోహ్లీ బీసీసీఐకి స్పష్టంగా చెప్పినప్పటికీ అలా జరగలేదు.
సమయం దొరక్క ఇబ్బంది పడుతున్నాం
'ఎప్పటిలాగే ఇప్పుడు కూడా సరైన సమయం దొరక్క ఇబ్బంది పడుతున్నాం. భవిష్యత్తులోనూ దీనిపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. టీమ్ గురించి ఎన్నో రోజుల ముందుగానే ఎలా ఆలోచిస్తామో.. విదేశీ పర్యటనలకు వెళ్లే ముందు సన్నద్ధత కోసం ఎంత సమయం ఉందన్నదానిపైనా ఆలోచించాలి' అని కోహ్లీ అన్నాడు. 'టెస్టు మ్యాచ్ ఫలితం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ జడ్జిమెంట్ ఇస్తారు. ఓడిపోతే ప్లేయర్స్ను తిడతారు. కానీ సిరీస్ కోసం సన్నద్ధమవడానికి ఎంత సమయం దొరికిందో ఎవరూ ఆలోచించరు. అందుకే ఇప్పుడు పరస్థితుల్లో బౌన్సీ పిచ్లు తయారు చేసుకొని ఆ పరిస్థితులకు అలవాటు పడటానికి ప్రయత్నిస్తున్నాం' అని విరాట్ కోహ్లీ చెప్పాడు.
తుది జట్టులో ఇద్దరు స్పిన్నర్లు ఉంటారా?
విదేశాల్లో తుది జట్టులో ఇద్దరు స్పిన్నర్లు ఉండటంపై కూడా కోహ్లీ స్పందించాడు. విదేశీ టూర్లకు వెళ్లినపుడు అశ్విన్, జడేజా ఇద్దరికీ చాన్స్ ఉంటుందని తాను గ్యారెంటీ ఇవ్వలేనని కోహ్లీ స్పష్టం చేశాడు. జట్టు బ్యాలెన్స్తోపాటు ప్రత్యర్థి జట్టు బ్యాటింగ్ లైనప్ బట్టి ఎవరో ఒక స్పిన్నర్కు మాత్రమే అవకాశం ఇవ్వనున్నట్లు విరాట్ కోహ్లీ తెలిపాడు. నాగపూర్లో జరగబోయే తుది జట్టులో కూడా ఇద్దరు స్పిన్నర్లు ఉంటారా? లేదా అన్న విషయాన్ని కూడా తాను చెప్పలేనని కోహ్లీ అన్నాడు.
గత రికార్డులతో పనిలేదు
2008 నుంచి విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ల్లో స్పిన్నర్లు 100 వికెట్లు తీసినా... శుక్రవారం నాటి మ్యాచ్కు ఆ రికార్డులతో పనిలేదని విరాట్ కోహ్లీ తేల్చి చెప్పాడు. 'ఎవరితో ఆడుతున్నాం. ఎలాంటి పిచ్పై ఆడుతున్నామన్నదే ఇక్కడ ముఖ్యమని దానిని బట్టే జట్టు ఎంపిక అనేది ఉంటుంది. గత రికార్డులతో పనిలేదు. ఎందుకంటే మ్యాచ్ను బట్టి పిచ్లో మార్పులు వస్తుంటాయి. ప్రస్తుతం బ్రిస్బేన్లో జరుగుతున్న యాషెస్ తొలి టెస్ట్లో మనం ఎప్పుడూ చూసే పేస్, బౌన్స్ వికెట్ ఇప్పుడు లేదు. చివరగా ఏదైతే అనుకుంటామే దాని ప్రకారమే జట్టు ఎంపిక ఉంటుంది' అని కోహ్లీ చెప్పాడు.