హైదరాబాద్: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ వంద అంతర్జాతీయ సెంచరీల రికార్డుని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బద్దలు కొట్టగలడో? లేదో? అనే విషయాన్ని అతడే చెప్పాలని దక్షిణాఫ్రికా మాజీ ఆల్రౌండర్ జాక్వెస్ కలిస్ అన్నాడు. విరాట్ కోహ్లీ ప్రపంచ స్థాయి ఆటగాడని... ప్రస్తుతం అతడు ఆకలితో ఉన్నాడని.. అందుకే పరుగుల సునామీ సృష్టిస్తున్నాడని కల్లిస్ పేర్కొన్నాడు.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
"కోహ్లీ అనుకున్న స్థాయికి అతను చేరుకోగలడనే నమ్మకం నాకుంది. అతను ప్రపంచ స్థాయి ఆటగాడు. ఆకలితో ఉన్నాడు. పరుగులు చేయడానికి కష్టపడతాడు. గత కొన్నేళ్లుగా తన సత్తా చాటుతూనే ఉన్నాడు. అతను విషయాలన్నింటినీ చాలా సాధారణంగా ఉంచుతాడు. అతను బ్యాటింగ్ను చూడడానికి ప్రజలు ఇష్టపడతారు" అని కల్లిస్ అన్నాడు.
సచిన్ అంతర్జాతీయ వంద సెంచరీల రికార్డును కోహ్లీ అధిగమిస్తాడా అనే విషయంపై కూడా కలిస్ స్పందించాడు. "సచిన్ను రికార్డును బద్దలు కొట్టేందుకు సిద్ధంగా ఉన్నాడో లేదో కోహ్లీనే చెప్పాలి. ఎందుకంటే ఫిట్నెస్, ఆడగల సత్తా, సామర్థ్యం గురించి అతడికే ఒక క్లారిటీ ఉంటుంది" అని కల్లిస్ చెప్పుకొచ్చాడు.
ఆస్ట్రేలియాపై ఎదురైన ఓటమి ప్రభావం ప్రపంచకప్లో టీమిండియాపై ఉండదని కల్లిస్ చెప్పాడు. "కోహ్లి ఒత్తిడిలో ఉన్నాడని అనుకోను. అతను రాణిస్తూనే ఉన్నాడు. అతణ్ని జట్టు సభ్యులు అనుకరిస్తున్నారు. ఐపీఎల్లో పనిభారం అనేది ఆటగాళ్లను బట్టి ఉంటుంది" అని కల్లిస్ పేర్కొన్నాడు. ప్రపంచకప్లో ఏ జట్టు గెలుస్తుందో చెప్పలేమని, సపారీలు ఫేవరేట్ అని తాను అనుకోవడం లేదని పేర్కొన్నాడు.