ఆక్లాండ్: గత కొన్ని మ్యాచ్లలో నిలకడగా రాణించడానికి గల కారణం నాకు తెలీదు అని టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ అన్నాడు. ఎప్పుడూ కూడా జట్టును ముందుకు తీసుకెళ్లడంతో పాటు ఏం కావాలో దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత నాపై ఉంది అని రాహుల్ తెలిపాడు. రెండో టీ20లో పరిస్థితులు పూర్తిగా తారుమారయ్యాయి, తొలి టీ20లో ధాటిగా ఆడినట్టు ఈ మ్యాచ్లో ఆడలేకపోయా అని ఆయన చెప్పుకొచ్చాడు.
కివీస్ పుంజుకుంటుంది.. ఇంకో మ్యాచ్ గెలవాల్సి ఉంది: కోహ్లీ
'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు సందర్భంగా కేఎల్ రాహుల్ మాట్లాడుతూ... 'ఈ రోజు స్పష్టంగా మార్పులు కనిపించాయి. విభిన్న పరిస్థితులలోక్రికెట్ ఆడాం. పిచ్ పూర్తిగా మారిపోయింది. లక్ష్యం చిన్నది అయిపోయింది. రోహిత్ శర్మ (8), కెప్టెన్ విరాట్ కోహ్లీ (11) త్వరగా పెవిలియన్ చేరడంతో.. నాపై బాధ్యత పెరిగింది. తొలి టీ20 లాగ ఆడలేం అనుకున్నా. ఆ పరిస్థితులలో నేనేం చేయాలో తెలిసింది. తొలి మ్యాచ్లో ఆడినట్లు ఆడలేకపోయా' అని తెలిపాడు.
శ్రేయాస్ అయ్యర్ రెండు మ్యాచ్లలో బాగా ఆడాడు. కీలక సమయంలో క్రీజులోకి వచ్చి వేగంగా పరిస్థితులను అర్ధం చేసుకుని పరుగులు చేసాడు. కీలక భాగస్వామ్యం మ్యాచ్ను నిలబెట్టింది. కొన్ని మ్యాచ్లుగా నేను నిలకడగా రాణించడానికి గల కారణం నాకు తెలీదు. ఎల్లప్పుడూ జట్టును ముందుకు తీసుకెళ్లడంతో పాటు ఏం కావాలో దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత నాపై ఉంది. ఈ రోజు చాలా మంచి మంచి క్రికెట్ ఆడాను' అని రాహుల్ చెప్పాడు.
ఆదివారం కివీస్తో జరిగిన రెండో మ్యాచ్లో టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. 133 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 17.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (57; 50 బంతుల్లో 3x4, 2x6), శ్రేయస్ అయ్యర్ (44; 33 బంతుల్లో 1x4, 3x6) రాణించారు. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 132 పరుగులకే పరిమితమైంది. మార్టిన్ గుప్తిల్ (33), కొలిన్ మన్రో (26), సీఫెర్ట్ (33 నాటౌట్) రాణించారు. భారత బౌలర్లలో జడేజా రెండు వికెట్లు సాధించాడు. మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించిన రాహుల్కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.