
హైదరాబాద్: ఐపీఎల్లో యల్ చాలెంజర్స్ బెంగళూరు మరో విజయాన్ని నమోదు చేసింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా శుక్రవారం రాత్రి కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. 214 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 203 పరుగులకే పరిమితమైంది. ఈ విజయంతో ఆర్సీబీ ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
చేధనలో కేకేఆర్ ఆటగాళ్లు క్రిస్ లిన్(1), సునీల్ నరైన్(18), శుభమాన్ గిల్(9), రాబిన్ ఊతప్ప(9)లు తక్కువ స్కోర్లకే పెవిలియన్కు చేరారు. దీంతో 79 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన నితీష్ రాణా 46 బంతుల్లో 85 నాటౌట్(9ఫోర్లు, 5 సిక్సర్లు), ఆండ్రీ రస్సెల్ 25 బంతుల్లో 65(2 ఫోర్లు, 9 సిక్సర్లు) చెలరేగడంతో విజయానికి చేరువగా వచ్చింది.
వీరిద్దరి బ్యాటింగ్కు దెబ్బకు కోల్కతా ఈడెన్ గార్డెన్స్ మైదానంలో పరుగుల వరద పారింది. అయితే, లక్ష్యం పెద్దది కావడంతో... వీరిద్దరూ ఎంత ప్రయత్నించినా కేకేఆర్ను ఓటమి నుంచి తప్పించలేకపోయారు. ఆర్సీబీ బౌలర్లలో డేల్ స్టెయిన్ రెండు, నవదీప్ షైనీ, మార్కస్ స్టోయినిస్ తలో వికెట్ తీసుకున్నారు.
కోల్కతా విజయ లక్ష్యం 214
అంతకముందు కెప్టెన్ విరాట్ కోహ్లీ 58 బంతుల్లో 100(9 ఫోర్లు, 4 సిక్సులు), మొయిన్ అలీ 28 బంతుల్లో 66(5 ఫోర్లు, 6 సిక్సులు) రాణించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసింది. దీంతో కోల్కతా నైట్రైడర్స్కు 214 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఈ మ్యాచ్ ఆరంభంలోనే ఓపెనర్ పార్ధివ్ పటేల్(11) వికెట్ను కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అక్షదీప్ నాథ్(13)కూడా నిరాశపరచడంతో 59 పరుగులకే రెండు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన మొయిన్ అలీ(28 బంతుల్లో 66)తో కలిసి కోహ్లీ స్కోరు బోర్డుని పరిగెత్తించాడు.
వీరిద్దరూ కలిసి నిలకడగా ఆడుతూ మూడో వికెట్కు 90 పరుగులు జోడించారు. మొయిన్ అలీ రెచ్చిపోయి ఆడుతుంటే కెప్టెన్ కోహ్లీ అతడికి చక్కటి సహకారం లభించింది. ఈ క్రమంలోనే కోహ్లీ తొలుత హాఫ్ సెంచరీ సాధించగా, ఆ తర్వాత కొద్దిసేపటికే మొయిన్ అలీ కూడా హాఫ్ సెంచరీని నమోదు చేశాడు.
కుల్దీప్ వేసిన ఇన్నింగ్స్ 16 ఓవర్లో 27 పరుగులు సాధించిన మొయిన్ అలీ ఆ ఓవర్ ఆఖరి బంతికి ప్రసిధ్ కృష్ణకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. అలీ ఔటైన తర్వాత కోహ్లీ మరింత దూకుడుగా ఆడి సెంచరీ సాధించాడు. సెంచరీ అనంతరం ఆఖరి ఓవర్ ఆఖరి బంతికి గుర్నే బౌలింగ్లో శుభమాన్ గిల్కి క్యాచ్ ఇచ్చాడు.
ఈ మ్యాచ్లో ఆర్సీబీ తొలి పది ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 70 పరుగులు చేస్తే, చివరి 10 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది. కోల్కతా బౌలర్లలో ఆండ్రీ రస్సెల్, కుల్దీప్ యాదవ్, సునీల్ నరేన్, గర్నేలు తలో వికెట్ తీసుకున్నారు.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్కతా
ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్ దినేశ్ కార్తీక్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్లో ఆర్సీబీ ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. అనారోగ్యం కారణంగా ఆర్సీబీ విధ్వంసకర బ్యాట్స్మన్ ఏబీ డివిలియర్స్ ఈ మ్యాచ్కి దూరం కాగా అతడి స్థానంలో పేసర్ డేల్ స్టెయిన్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. 9 ఏళ్ల తర్వాత తిరిగి ఆర్సీబీ జెర్సీలో డెల్ స్టెయిన్ మ్యాచ్ ఆడుతున్నాడు.