
హైదరాబాద్: అభిమానం హద్దుల దాటితే ఎక్కడికైనా వెళ్తుంది. మ్యాచ్ జరుగుతుండగా భద్రతా సిబ్బందిని దాటి కోహ్లీ కాళ్లకు మొక్కడం, అవార్డు అందజేయడానికి వచ్చిన ధోనీ కాళ్లపై పడి ఎంతలేపినా లేవకపోవడం ఇలా అభిమానం ముదిరి ఎక్కడిదాకా వచ్చిందంటే ఏకంగా అభిమాన జట్టు జెండాను ఎవరెస్టు శిఖరంపై నాటాలనుకునేంత పెరిగిపోయింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన వంగ్డీ భూటియా.. ఎవరెస్టు ఎక్కే బృందంలో సభ్యుడు. అతడు ఐపీఎల్ జట్టు కోల్కతా నైట్రైడర్స్(కేకేఆర్)కు వీరాభిమాని. ఆ జట్టు కోసం అతడు ఎవరెస్ట్ బేస్ క్యాంప్(నేపాల్) నుంచి ఓ వీడియో సందేశాన్ని పంపాడు.
అందులో ''నేను ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి కేకేఆర్కు వీరాభిమానిని. ఆ జట్టు జెండాను ఎప్పటికైనా ఎవరెస్ట్ పైన ఎగురవేయాలని అనుకునేవాడిని. నేను ఎవరెస్ట్ ఎక్కడం.. ఐపీఎల్.. రెండూ ఒకేసారి జరుగుతున్నాయి. కాబట్టి ఫైనల్ నాటికి నేను పర్వతం పైకి చేరుకుని, కేకేఆర్ జెండాను అక్కడ రెపరెపలాడిస్తాను. ఫైనల్లో మా జట్టే గెలవాలని కోరుకుంటున్నాను'' అని పేర్కొన్నాడు.
దీనికి కేకేఆర్ యజమాని, బాలీవుడ్ బాద్షా షారూఖ్ స్పందించాడు. భూటియా పంపిన వీడియోను షేర్ చేస్తూ ''భూటియా.. మీరు మాపై చూపిస్తున్న ప్రేమకు, గౌరవానికి చాలా థ్యాంక్స్. నీ ప్రయాణం విజయవంతంగా జరగాలని కేకేఆర్ ఫ్యామిలీ కోరుకుంటోంది. ఇది మాకు చాలా గొప్ప గౌరవం. నీలాగే ధైర్యంగా, సాహసంతో ఆడేందుకు ప్రయత్నిస్తాము'' అని షారూఖ్ ట్వీట్ చేశాడు.
కోల్కతా ఆడిన ఆఖరి మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడి ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 9వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. చేధనకు దిగిన కోల్కతా జట్టు రెండు బంతులు మిగిలి ఉండగానే 5వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. దీంతో కోల్కతాకు ప్లేఆఫ్ బెర్తు ఖాయమైంది. బుధవారం జరగనున్న ఎలిమినేషన్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్తో పోటీపడుతోంది. ఒకవేళ అది గెలిస్తే.. సెమీ ఫైనల్కి వెళ్తుంది.