ముంబై: టీమిండియా మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్పై గత ఆరు నెలలుగా తీవ్ర చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా 'ధోనీ రిటైర్స్' ట్యాగ్ ట్రెండ్ అవడం.. ఆ మరుసటి రోజు దానికి కౌంటర్గా 'ధోనీ నెవర్ రిటైర్స్' ట్యాగ్ ట్రెండ్ చేయడంతో ధోనీ వీడ్కోలు వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే మహీ మరికొన్ని రోజులు ఆడుతాడని చాలా మంది మాజీ క్రికెటర్లు మద్దతుగా నిలవగా.. ధోనీ లాస్ట్ మ్యాచ్ ఆడేశాడని మరికొందరు అంటున్నారు. ఎలాంటి వార్తలు వచ్చినా మహీ మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు.
ఆరోజు రితికా అందుకే ఏడ్చింది: రోహిత్
ఈ నేపథ్యంలో ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై బీసీసీఐ మాజీ చీఫ్ సెలక్టర్ కిరణ్ మెరే చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ధోనీ మళ్లీ క్రికెట్ ఆడటం అంత సులభం కాదని ఆయన పేర్కొన్నారు. 'మహీ క్రికెట్ ఆడడం కష్టం. కానీ నిర్ణయం అతనిదే. అతని నిర్ణయాన్ని గౌరవించాలి. మనస్సులో ఆడాలనే ఉంటుంది కానీ శరీరం సహకరించదు. అయితే ఐపీఎల్కి ముందు నేను అతన్ని నెట్స్లో చూశాను..చాలా ఫిట్గా ఉన్నాడు. టెన్నిస్ ఆటలో 34, 39 సంవత్సరాల ఆటగాళ్లు టాప్లో ఉన్నారు. ఇక్కడ కూడా క్రమశిక్షణతో ఉండి.. మానసికంగా, శారీరకంగా బలంగా ఉంటే మళ్లీ క్రికెట్ ఆడొచ్చు. అశీశ్ నెహ్రా కూడా అలానే చేశాడు' అని కిరణ్ మెరే పేర్కొన్నారు.
దేశంలో లాక్డౌన్ని ఎత్తివేసిన తర్వాత ఎంఎస్ ధోనీ తన ప్లాన్స్పై పక్కా క్లారిటీతో ఉన్నట్లు తాజాగా అతని సతీమణి సాక్షి ధోనీ వెల్లడించారు. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ అధికారిక ఇన్స్టా లైవ్చాట్లో రూపా రమణితో సాక్షి మాట్లాడుతూ... 'లాక్డౌన్ తర్వాత క్రికెట్ ఉంటే.. ధోనీ మ్యాచ్లు ఆడతాడు. ఒకవేళ మ్యాచ్లు లేకపోతే.. నేను మహీ కలిసి మంచు కొండల్లో విహరించాలని ప్లాన్ చేసుకున్నాం. ధోనీకి మంచు అంటే మహా ఇష్టం. ఉత్తరాఖండ్లోని మంచు కొండల్లో విహరించాలని ధోనీ ఇప్పటికే ప్లాన్ చేసాడు' అని తెలిపారు.
2019 వన్డే ప్రపంచకప్ తర్వాత ఎంఎస్ ధోనీ టీమిండియాకి దూరమయ్యాడు. బీసీసీఐ సెలక్షన్కు కూడా అందుబాటులో ఉండడం లేదు. దీంతో సెంట్రల్ కాంట్రాక్టు నుండి అతనిని బీసీసీఐ తప్పించింది. ఇక మహీ స్థానంలో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్కి భారత సెలక్టర్లు వరుసగా అవకాశాలిచ్చారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఐపీఎల్ 2020 నిరవధిక వాయిదా పడింది. దీంతో ధోనీ ప్రొఫెషనల్ క్రికెట్లోకి తిరిగి రావడాన్ని ఆలస్యం చేసింది. ఐపీఎల్లో మహీ బాగా రాణించినట్లయితే.. అక్టోబర్-నవంబర్లో జరిగే టీ20 ప్రపంచకప్ ఆడే అవకాశం ఉండేది. కానీ పరిస్థితి ఇప్పుడు అలా లేదు. లీగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో కచ్చితంగా చెప్పలేం. దీంతో ధోనీ అంతర్జాతీయ క్రికెట్ భవిష్యత్తు డైలమాలో పడింది.