ఈ దశాబ్దపు రన్ మెషిన్ విరాట్ కోహ్లీ: 2010 నుంచి ప్రస్థానం సాగిందిలా!, నెలకొల్పిన రికార్డులివే!

హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్లో మరో సంవత్సరం ముగియనుంది. 2019 సంవత్సరం ముగిసేందుకు ఒక నెల మాత్రమే మిగిలి ఉంది. గత పదేళ్లలో అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. క్రీడా ప్రపంచం మూడు వేర్వేరు వన్డే వరల్డ్కప్లను చూసింది.
డే అండ్ నైట్ టెస్టులు, ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ప్రారంభం, పరిమిత ఓవర్ల క్రికెట్లో డెసిషన్ రివ్యూ సిస్టమ్ ప్రవేశపెట్టడం మొదలైన ఎన్నో కొత్త మలుపులు చోటు చేసుకున్నాయి. ప్రపంచ క్రికెట్లో సూపర్ పవర్ జట్టుగా అవతరించడానికి ఆస్ట్రేలియా, ఇండియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ వంటి దేశాలు గత దశాబ్దంలో ఎన్నో ప్రయత్నాలు చేశాయి.
అదే సమయంలో చాలా కొద్ది మంది ఆటగాళ్ళు ప్రపంచ క్రికెట్లో తమదైన ముద్ర వేశారు. మరికొందరు అంచనాలకు అనుగుణంగా రాణించలేకపోయారు. అయితే, గత పదేళ్లలో ప్రపంచ క్రికెట్లో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించిన ఏకైక క్రికెటర్ మాత్రం ఒక్కడే. అతడే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.

కోహ్లీ తనదైన ముద్రను
ప్రపంచ క్రికెట్పై విరాట్ కోహ్లీ తనదైన ముద్రను ఎంతలా అంటే "మాకు కోహ్లీని ఇచ్చేయండి కావాలంటే కశ్మీర్ను మీ దగ్గరే ఉంచుకోండి" అని పాకిస్థాన్ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేంతగా. ఓ సాధారణ క్రికెటర్ ప్రపంచ క్రికెట్ను శాసించే స్థాయికి రావడం వెనుక ఉన్న కృషి ఎంతో ఉంది. అయితే, గత గత పదేళ్లలో విరాట్ కోహ్లీ ఆవిర్భావం అపురూపమైనది.

మూడు ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు
ఢిల్లీకి చెందిన ఈ క్రికెటర్ ఈ దశాబ్దంలో మూడు ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ దశాబ్దంలో విరాట్ కోహ్లీ చేసినన్ని పరుగులు మరే ఇతర ఆటగాడు చేయలేక పోవడం విశేషం. ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన పింక్ బాల్ టెస్టులో విరాట్ కోహ్లీ అద్భుతమైన సెంచరీతో ఈ సంవత్సరాన్ని ముగించాడు.

తొలి భారత క్రికెటర్గా కోహ్లీ చరిత్ర
డే నైట్ టెస్టులో సెంచరీ సాధించడంతో భారత్ తరుపున ఈ ఘనత సాధించిన తొలి భారత క్రికెటర్గా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. గత పదేళ్ల కాలంలో కోహ్లీ సృష్టించిన అనేక రికార్డులలో ఇదొకటి. గత పదేళ్ల కాలంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన విరాట్ కోహ్లీ అత్యధిక సెంచరీలు (69), హాఫ్ సెంచరీ (95)ల రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

యావరేజి 50కిపైగా
అంతేకాదు మూడు ఫార్మాట్లలోనూ కోహ్లీ యావరేజి 50కిపైగా ఉండటం విశేషం. టెస్టుల్లో 8818, వన్డేల్లో 11,036, టీ20ల్లో 2450 (మొత్తం 20,688) పరుగులు చేశాడు. ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా ఆటగాడు హాషిమ్ ఆమ్లా (15,185) కంటే విరాట్ కోహ్లీ ఐదు వేల పరుగులు ఎక్కువ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా 20వేల మైలురాయిని కూడా కోహ్లీ అందుకున్నాడు.

అత్యంత వేగంగా 20వేల పరుగుల మైలురాయిని
ఈ ఘనత సాధించడానికి మాజీ క్రికెట్ దిగ్గజాలు సచిన్, లారాలకు 453 ఇన్నింగ్స్లు అవసరంకాగా కోహ్లీ 417 ఇన్నింగ్స్ల్లోనే ఈ ఘనత సాధించాడు. ఈ దశాబ్దంలో 69 (టెస్టుల్లో 27, వన్డేల్లో 42) అంతర్జాతీయ సెంచరీలు సాధించిన కోహ్లీ 95 (టెస్టుల్లో 22, వన్డేల్లో 51, టీ20ల్లో 22) హాఫ్ సెంచరీలు బాదాడు. కోహ్లీ గనుక ఇలాగే రికార్డులు నెలకొల్పితే అంతర్జాతీయ క్రికెట్లో సచిన్ సాధించిన 100 సెంచరీల రికార్డును బద్దలు కొట్టడం ఏమంత కష్టం కాదని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications