హైదరాబాద్: దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ ఏబీ డివిలియర్స్తో టెన్నిస్ రీమ్యాచ్ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నట్లు టెన్నిస్ ఆటగాడు కెవిన్ అండర్సన్ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వింబుల్డన్ టోర్నీలో కెవిన్ అండర్సన్ దూసుకెళ్తున్నాడు.
గురువారం జరిగిన మ్యాచ్లో నాలుగో రౌండ్కు చేరిన క్రమంలో ఆండర్సన్ తన చిన్ననాటి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకున్నాడు. కొన్ని దశాబ్దాల క్రితం ఇద్దరి మధ్య ఒక టెన్నిస్ మ్యాచ్ జరిగిందని, ఆ మ్యాచ్లో తనపై ఏబీ డివిలియర్స్ విజయం సాధించాడని చెప్పాడు.
ఆ తర్వాత మా ఇద్దరి మధ్య మ్యాచ్ జరగలేదని పేర్కొన్నాడు. 'ఏబీతో టెన్నిస్ మ్యాచ్ ఆడి చాలా ఏళ్లు అయ్యింది. అతనికి 12 ఏళ్లు.. నాకు 10 ఏళ్ల వయసులో ఇద్దరం కలిసి ఒక టెన్నిస్ మ్యాచ్ ఆడాం. ఆ మ్యాచ్ లో నన్ను ఏబీ ఓడించాడు' అని చిన్ననాటి సంఘటనను గుర్తు చేసుకున్నాడు.
శుక్రవారం బెల్జియంకు చెందిన రూబెన్ బెల్మానాస్తో జరిగిన మ్యాచ్లో ఆండర్సన్ 7-6 (3), 6-4, 7-6 (3)తేడాతో విజయం సాధించాడు. 'డివిలియర్స్ ఒక మంచి టెన్నిస్ ప్లేయర్. ప్రస్తుతం ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్ కు ఏబీ దూరంగా ఉన్నాడు. మా మధ్య రీమ్యాచ్ కు ఇదే సమయం అనుకుంటున్నా' అని అండర్సన్ తెలిపాడు.
ఆండర్సన్ వ్యాఖ్యలను టీవీలో చూసిన ఏబీ డివిలియర్స్ తనదైన శైలిలో స్పందించాడు. 'నాలుగో రౌండ్కు చేరిన అండర్సన్కు ఆల్ ద బెస్ట్.. మన మధ్య రీమ్యాచ్ 30 నిమిషాల్లో ముగించేస్తా' అంటూ ఏబీ డివిలియర్స్ ట్వీట్ చేశాడు.
నిజానికి ఏబీ డివిలియర్స్ మల్టీ టాలెంట్ ఉన్న ఆటగాడు. క్రికెట్తో పాటు పలు క్రీడల్లో ప్రావీణ్యం ఉంది. అప్పటల్లో దక్షిణాఫ్రికా జూనియర్ డేవిస్ కప్ టెన్నిస్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అయితే క్రికెట్ను తన కెరీర్గా ఎంచుకోవడంతో మిగతా క్రీడల్ని ఏబీ వదులుకోవాల్సి వచ్చింది.