రెండు ముక్కలవ్వడం చూస్తుంటే భయమేసింది:
కోజికోడ్ విమానాశ్రయ దుర్ఘటనపై భారత క్రికెటర్లు సామాజిక మాధ్యమాల్లో స్పందించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 'కోజికోడ్లో విమాన ప్రమాదానికి గురైన వారి కోసం ప్రార్థిస్తున్నా. ప్రాణాలు కోల్పోయిన వారి ప్రియమైన వారందరికీ ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా' అని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ శుక్రవారం రాత్రి ట్వీట్ చేశారు. 'కొలికోడ్ నుంచి భయంకరమైన వార్త తెలిసింది. విమానం రెండు ముక్కలవ్వడం చూస్తుంటే భయమేసింది. అందరూ బాగుండాలని ప్రార్థిస్తున్నా' అని మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఆవేదన వ్యక్తం చేసారు.
2020 దయచేసి కనికరించు:
'కోజికోడ్ విమానాశ్రయ ప్రమాదం నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రయాణికులు మరియు సిబ్బంది కోసం ప్రార్థిస్తున్నా. 2020 దయచేసి కనికరించు' అని టీమిండియా మాజీ ఆల్రౌండర్, ప్రపంచకప్ల హీరో యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు. ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో 2011 ప్రపంచకప్ గెలవడంతో కీలక పాత్ర పోషించి 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా నిలిచాడు. భారత్ తరఫున 2000లో అరంగేట్రం చేసిన యువీ.. 2017లో చివరి మ్యాచ్ ఆడాడు. గతేడాది వన్డే ప్రపంచకప్లో చోటు దక్కకపోవడంతో యువీ హాఠాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించాడు.
షాకింగ్ న్యూస్:
'షాకింగ్ న్యూస్. కొలికోడ్లో చోటుచేసుకున్న ఎయిర్ఇండియా ప్రమాదంలో ప్రయాణికులు, సిబ్బంది క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నా. అందరికి నా ప్రగాఢ సానుభూతి' అని టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ట్వీట్ చేశారు. 'కొలికోడ్ విమాన ప్రమాదంలో చిక్కుకున్న అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నా. ఈ విషాదకర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలియజేస్తున్నా' అని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేర్కొన్నారు.
ఒక వేళ మంటలు ఏర్పడివుంటే:
విమానం రన్వే చివరకు వెళ్లి రెండు ముక్కలుగా విడిపోయింది. అయితే అదృష్టవశాత్తు ఎలాంటి మంటలు రాలేదు. ఒక వేళ మంటలు ఏర్పడివుంటే ప్రాణ నష్టం ఇంకా ఎక్కువగా ఉండేది. 2010లో మంగళూరు విమానాశ్రయంలో ఇదే తరహా ప్రమాదం జరగ్గా.. మంటలు రావడంతో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు. విమానాలు రన్వేలపై దిగే సమయంలో టైర్లలోని కొన్ని రబ్బరు శకలాలు కిందపడుతుంటాయి. వర్షంతో ఇవి రన్వేను మరింత జారుడుగా మారుస్తాయి. దీంతోనే ఈ ప్రమాదం జరగవచ్చని సమాచారం.