జట్టులో చోటు కోల్పోయిన పంత్:
పంత్ బ్యాటింగ్లో పూర్తిగా విఫలమవడంతో ఇప్పటికే టెస్ట్ జట్టులో చోటు కోల్పోయాడు. మరోవైపు ఇక వికెట్ల వెనుక మోస్తారుగా రాణిస్తూ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అతనికి ఎందుకు అన్ని అవకాశాలు ఇస్తున్నారు అని మాజీలు టీమిండియా మేనేజ్మెంట్ను ప్రశ్నిస్తున్నారు. అయినా యాజమాన్యం అతడికి అండగా ఉంటూ వీలైనన్ని అవకాశాలిస్తూ ప్రోత్సహిస్తోంది.
ఆటపైనే దృష్టి సారించాలి:
బెంగాల్తో జరుగుతున్న రంజీ మ్యాచ్ సందర్భంగా గుజరాత్ కెప్టెన్ పార్థివ్ పటేల్ గురువారం మీడియాతో మాట్లాడాడు. 'ఇప్పటి యువ ఆటగాళ్లకు సీనియర్ ఆటగాళ్లతో ఆడడం, డ్రెస్సింగ్ రూమ్ పంచుకునే అవకాశం దక్కుతోంది. అయితే ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న సందర్భాల్లో అందరి నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతాయి. వాటికి దూరంగా ఉండి, ఆటపైనే దృష్టి సారించాలి' అని తెలిపాడు.
ఎవరేమనుకున్నా పట్టించుకోకు:
'టీమిండియాకు ఆడుతుంటే ఒత్తిడి సహజంగా ఉంటుంది. ప్రతి ఆటగాడు ఏదో ఒక దశలో ఒత్తిడిని ఎదుర్కొంటాడు. అలాంటి సందర్భాల్లోనే నైపుణ్యాలు మరింత మెరుగవుతాయి. వెస్టిండీస్తో జరిగిన టీ20 సిరీస్లో పంత్ బాగా ఆడాడు. ప్రతికూల పరిస్థితుల్లో బ్యాటింగ్ చేస్తే ఉత్తమ బ్యాట్స్మన్గా రాణిస్తాడు. పంత్ నీ గురించి ఎవరేమనుకున్నా పట్టించుకోకు. ఆటమీద ధ్యాస పెట్టు' అని పార్థివ్ సూచించాడు.
అత్యుత్తమ కీపర్ సాహా:
'టీమిండియా అత్యుత్తమ టెస్టు కీపర్ వృద్ధిమాన్ సాహా అని నా అభిప్రాయం. అతడు క్యాచులు పట్టే విధానం చూస్తే మైదానంలో ఉత్సాహం పెరుగుతుంది. సాహా ప్రపంచంలోనే నంబర్ వన్ కీపర్' అని పార్థివ్ పేర్కొన్నాడు. పార్థివ్ టీమిండియా తరపున 25 టెస్టులు, 38 వన్డేలు, 2 టీ20లు ఆడాడు. టెస్టులలో 934 పరుగులు, వన్డేలలో 736 పరుగులు, టీ20లలో 36 పరుగులు చేసాడు.