

హైదరాబాద్: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే దివంగత నేత కరుణానిధికి అన్ని రంగాల్లో ప్రవేశం ఉంది. రచయిత అని గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆయనకు క్రికెట్ అంటే కూడా అమితమైన ఇష్టమట. క్రికెట్ మ్యాచ్లను వీక్షించడం కోసం ఆయన పార్టీ సమావేశాలను కూడా చాలా సార్లు వాయిదా వేశారంట.
ఈ విషయాన్ని ఆయన కుమార్తె కనిమొళి ఓ సందర్భంలో ఓ జాతీయ వెబ్సైట్కు ఇచ్చిన ఇంటర్యూలో వెల్లడించారు. "మ్యాచ్లు చూడటానికి కొన్నిసార్లు సమావేశాలను కూడా రద్దుచేసుకొనేవారు. అలాగే తన సహచరులతో కలిసి వాటిని తిలకించేవారు" అని కనిమొళి చెప్పారు. కరుణానిధికి ఇష్టమైన క్రికెటర్ కపిల్ దేవ్.
2013లో ఒక సందర్భంలో ఆయనే స్వయంగా ఈ విషయాన్ని చెప్పారు. 1983 ప్రపంచ్ కప్ విజేతగా భారత్ను నిలిపిన కెప్టెన్ కపిల్ దేవ్కు తాను అభిమానిని అని ఆయన ట్వీట్ చేశారు. అయితే ఇప్పటి తరంలో మాత్రం ధోనీ తన ఫేవరెట్ క్రికెటర్ అని ఆయన ఓ సందర్భంలో చెప్పారు.
2011లో వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాకు రూ.3 కోట్లు రివార్డు ప్రకటించడంతో పాటు అప్పటి జట్టులో సభ్యుడిగా ఉన్న తమిళ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్కు ప్రత్యేకంగా మరో కోటి రూపాయలు ప్రకటించారు. "ఇన్ని రోజులు నేను కపిల్ దేవ్కు అభిమానిని. ఇప్పుడు నాకు అత్యంత అభిమాన క్రికెటర్ ధోని" అప్పట్లో కరుణానిధి ట్విటర్ ట్వీట్ చేశారు.
సచిన్ జీవితం ఆధారంగా రాసిన 'ప్లేయింగ్ ఇట్ మై వే' పుస్తకం విడుదలైన వెంటనే చదివి, క్రికెట్ గాడ్కు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే 2010లో సచిన్ గ్వాలియర్లో చేసిన డబుల్ సెంచరీని అభినందిస్తూ ప్రత్యేకంగా టెలిగ్రామ్ కూడా పంపారు. 2013లో భారతరత్న తీసుకున్న సమయంలోనూ శుభాకాంక్షలు తెలిపారు.
క్రికెట్ మ్యాచ్లు చూడటానికి చిదంబరం స్టేడియానికి కరుణానిధి అప్పుడప్పుడు వెళ్తుండేవారని ఓ ఆంగ్ల పత్రిక 2013లో వార్తాకథనంలో రాసుకొచ్చింది.
మునిమనవడితో క్రికెట్ ఆడిన కరుణానిధి
డీఏంకే పార్టీ అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి గొప్ప రాజకీయవేత్త, సాహిత్యవేత్తగానే అందరికీ తెలుసు. కానీ, ఆయన గొప్ప క్రీడాభిమాని కూడా. ఆయనకు మనదేశంలో చాలా మంది అమితంగా ఇష్టపడే క్రికెట్ అంటే చాలా ఇష్టమట. అందుకే కరుణానిధి అస్వస్థతకు గురి కావడానికి ముందు.. తన ముని మనవడితో కలిసి సరదాగా క్రికెట్ ఆడారు.
ఆయన స్వగృహంలో వీల్ ఛైర్లోనే కూర్చొని క్రికెట్ ఆడారు. వీల్ ఛైర్కే పరిమితమైనప్పటికీ ఆయన బాగా బౌలింగ్ చేశారు. తన మనవడిని తికమక పెట్టేందుకు ఆయన స్పిన్ చేస్తూ బంతులను సంధించారు. మనవడు కూడా తాతకి ధీటుగా బ్యాటింగ్ చేశాడు. అప్పట్లో ఈ వీడియో సోషల్మీడియాలో హల్చల్ చేసింది. ఈ వీడియోలో కరుణ కుటుంబసభ్యులు కూడా ఉన్నారు. కరుణానిధి మరణం నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ ఆ వీడియో వైరల్ అవుతోంది.
కాగా, తీవ్ర అనారోగ్యంతో చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో చేరిన కరుణ మంగళవారం సాయంత్రం 6:10 గంటల సమయంలో తుదిశ్వాస విడిచినట్టు వైద్యులు ప్రకటించారు. కరుణానిధి మరణంతో తమిళనాడులో విషాద ఛాయలు అలుముకున్నాయి. రాజకీయ, సినీ ప్రముఖులు కరుణ మృతి పట్ల సానుభూతి ప్రకటించారు.