మరో 50 పరుగులు చేస్తే:
కేన్ విలియమ్సన్ మాట్లాడుతూ...'మేం అద్భుత ప్రదర్శన చేశాం. అయితే పోటీలో అంత తీవ్రత లేదు. భారత్ మరో 50 పరుగులు చేస్తే విజయం మాకు కాస్త కష్టమయ్యేది. రెండు టెస్టుల పిచ్లు బ్యాటింగ్, బౌలింగ్కు అనుకూలంగా ఉన్నాయి. ఆదిలో బౌలర్లపై ఒత్తిడి చేస్తే సులువుగా పరుగులు సాధించవచ్చు. గత రెండు మ్యాచ్లో మా ఆటగాళ్లు గొప్ప ప్రదర్శన చేశారు. వెల్లింగ్టన్ పిచ్ సీమర్లకు అనుకూలించినా మేం మంచి స్కోరు సాధించడం ఆనందంగా ఉంది' అని అన్నాడు.
టీమిండియాను ఓడించడం సంతృప్తి:
'కివీస్ పిచ్లు ఆసీస్ పరిస్థితులకు దగ్గరగా ఉన్నాయి. గతంతో పోలిస్తే పిచ్లు కాస్త కొత్తగా అనిపించాయి. మొత్తంగా టెస్టు క్రికెట్లో ఆల్రౌండ్ ప్రదర్శన చేసినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇదో అద్భుతమైన సిరీస్. ప్రపంచ అత్యుత్తమ క్రికెట్ జట్టు టీమిండియాను ఓడించడం సంతృప్తిగా ఉంది. కైల్ జేమిసన్ ఉత్సాహవంతమైన నైపుణ్యం ఉన్నవాడు. బ్యాట్తో పాటు బంతితోనూ మంచి ప్రదర్శన చేశాడు. పొడుగ్గా ఉండటం వల్ల ఈ పిచ్లపై బౌన్స్ లభిస్తుంది. అది జట్టుకెంతో ఉపయోగం. రెండు మ్యాచ్ల్లో చివర్లో విలువైన పరుగులు చేసి బాగా రాణించాడు' అని పేర్కొన్నాడు.
కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు:
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఇది తొలి టెస్టు సిరీస్ వైట్వాష్. అలాగే భారత్ ఎనిమిదేళ్ల తర్వాత ఈ ఫార్మాట్లో క్లీన్స్వీప్ను చవిచూసింది. 2012 ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ 0-4 తేడాతో ఓటమిపాలైంది. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు టీమిండియా టెస్టుల్లో క్లీన్స్వీప్ అయింది. టీమిండియా 2018 నుంచి విదేశాల్లో (దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్) ఆడిన నాలుగు సిరీస్ల్లో మూడు కోల్పోయింది.