హైదరాబాద్: రాబోయే 15 నుంచి 20 ఏళ్లలో క్రికెట్ అంటే ఒక్క టీ20 ఫార్మాటే మిగులుతుందని ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్ అభిప్రాయపడ్డాడు. న్యూజిలాండ్తో టీ20 సిరిస్ జరగనున్న నేపథ్యంలో జోస్ బట్లర్ స్కై స్పోర్ట్స్ ఛానెల్కి ఇచ్చిన ఇంటర్యూలో రాబోయే 15 నుంచి 20 ఏళ్లలో టెస్టు, వన్డే ఫార్మాట్లు కనుమరుగవుతాయని అన్నాడు.
ఈ కాలంలో ప్రతి ఒక్కరు ఏదైనా త్వరగా కావాలని కోరుకుంటున్నారని, దీంతో టీ20కి ఆదరణ పెరుగుతోందని చెప్పాడు. 'టెస్టు క్రికెట్ను మనమంతా ఇష్టపడుతాం. టెస్టు క్రికెట్లో ఎదురయ్యే క్లిష్ట పరిస్థితులు టీ20 ఫార్మాట్లో కనిపించవు. ఒక ఆటగాడిని నైపుణ్యం తెలియాలంటే టెస్టు ఫార్మాట్లోనే అది సాధ్యం. టెస్టు క్రికెట్ అంతరించిపోవడం బాధాకరమైన విషయమే' అని బట్లర్ అన్నాడు.
'రోజు రోజుకు టీ20 క్రికెట్ మరింత బలంగా తయారవుతోంది. అయితే, టెస్ట్ ఫార్మాట్కు ఆదరణ పెంచేలా ఐసీసీ చర్యలు తీసుకుంటుంది. టెస్టు క్రికెట్ను ఆడటాన్ని నేను ఎంతగానో ఆస్వాదిస్తా' అని తెలిపాడు. ఇంగ్లాండ్ తరుపున ఇప్పటివరకు కేవలం 18 టెస్టులే ఆడిన జోస్ బట్లర్ ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన యాషెస్ సిరీస్కు ఎంపిక కాలేదు.
'ఎర్ర బంతితో క్రికెట్ ఆడటాన్ని సీరియస్గా తీసుకుంటా. నా తెల్లబంతి బలాన్ని ఎర్ర బంతితో ఆడటానికి ఉపయోగిస్తా' అని బట్లర్ తెలిపాడు. బట్లర్ చివరి సారిగా 2016లో భారత్లో టెస్టు మ్యాచ్ ఆడాడు. టెస్టు క్రికెట్ ఆడటమే తనకిష్టమన్న బట్లర్ త్వరలో మరిన్ని టెస్టు మ్యాచ్లు ఆడేందుకు కృషి చేస్తానని అన్నాడు.
జోస్ బట్లర్ ప్రపంచ వ్యాప్తంగా జరుగుతోన్న అనేక టీ20 లీగ్లైన ఐపీఎల్, బీపీఎల్, బిగ్ బాష్ టీ20 లీగ్ల్లో పలు జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్ 11వ సీజన్ కోసం జనవరి 27,28 తేదీల్లో బెంగళూరు వేదికగా నిర్వహించిన ఐపీఎల్ వేలంలో బట్లర్ను రాజస్థాన్ రాయల్స్ రూ. 4 కోట్ల 40 లక్షలకు కొనుగోలు చేసింది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.