గాలె: ఆస్ట్రేలియాపై భారత్ సిరీస్ కైవసం చేసుకోవడంతో టెస్ట్ క్రికెట్కు గొప్ప ప్రచారం లభించిందని ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ తెలిపాడు. సొంతగడ్డపై భారత్ను ఓడించాలంటే అత్యుత్తమానికి మించిన ప్రతిభను కనబర్చాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. శ్రీలంకతో రెండో టెస్టుకు ముందు జో రూట్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్బంగా అప్కమింగ్ భారత్-ఇంగ్లండ్ సిరీస్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'ఆసీస్-భారత్ సిరీస్కు అద్భుతమైన క్రికెట్తో ముగింపునిచ్చారు. టీమిండియా గొప్పగా పోరాడింది. అసాధారణ సాహసాన్ని ప్రదర్శించింది. ఘోర ఓటమి నుంచి పుంజుకుంది. జట్టులోకి వచ్చిన ప్రతి ఒక్కరు రాణించారు. టెస్టు క్రికెట్ను ఆదరిస్తున్న అభిమానుల ప్రకారం ఆటకు ఈ సిరీస్ గొప్ప ప్రచారం తీసుకొచ్చింది. భారత్ ఇప్పుడు సుదీర్ఘ ఫార్మాట్ను మరింత రసవత్తరంగా మార్చేసింది' అని రూట్ తెలిపాడు.
'మాతో సిరీస్కు టీమిండియా గొప్ప ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుందని అనుకుంటున్నా. వారిది మంచి జట్టు. సొంతగడ్డపై విజయాలు ఎలా సాధించాలో బాగా తెలుసు. కోహ్లీసేనతో పోరాడాలంటే అత్యుత్తమానికి మించిన ప్రతిభను కనబరచాలి. ఏదేమైనా భారత్-ఇంగ్లండ్ సిరీస్ అద్భుతంగా ఉండనుంది. గెలవాలనే ఉద్దేశంతో మేం వస్తున్నాం. ఇందుకోసం మేమెంతో శ్రమించాలని తెలుసు' అని రూట్ పేర్కొన్నాడు. భారత్లో సిరీసుకు బెన్స్టోక్స్, జోఫ్రా ఆర్చర్ రావడం జట్టులో జోష్ నింపుతుందని వెల్లడించాడు. ఫిబ్రవరి 5 నుంచి భారత్లో ఇంగ్లండ్ పర్యటన మొదలుకానున్న విషయం తెలిసిందే. రెండు జట్లు నాలుగు టెస్టులు, ఐదు టీ20లు, మూడు వన్డేల్లో తలపడనున్నాయి.