వేలంలో ఊహించని ధర
తాజాగా ఇష్ సోధీతో జరిపిన ఇన్స్టా లైవ్లో జైదేవ్ ఉనాద్కట్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. '2018 సీజన్లో అనూహ్య ధర పలకడం నా ఆత్మవిశ్వాసాన్ని ఒక్కసారిగా పెంచింది. 2017లో ప్రదర్శన వల్లే జాతీయ జట్టులోకి వచ్చా. దీంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు భారీ ధర వెచ్చించింది' అని ఉనాద్కట్ అన్నాడు. 2017 ఐపీఎల్ సీజన్లో పుణే సూపర్ జాయింట్స్ తరఫున చక్కటి ప్రదర్శన చేయడంతో ఉనాద్కట్ను ఆ తర్వాతి వేలంలో చేజిక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. ఈ క్రమంలో రాజస్థాన్ రాయల్స్ రూ. 11.5 కోట్లు పెట్టి అతన్ని కొనుగోలు చేసింది.
భారత జట్టులో చోటు సంపాదించమే లక్ష్యం
ఫస్ట్-క్లాస్ ప్రదర్శన టెస్ట్ జట్టులో చోటు దక్కించుకోవడానికి సహాయపడుతుందని జైదేవ్ ఉనాద్కట్ ఆశాభావం వ్యక్తం చేశాడు. 'నేను ఎర్ర బంతితో బౌలింగ్ను చేయడాన్ని పూర్తిగా ఆనందించాను. మొదటి టెస్ట్ తర్వాత నాకు టీమిండియా తరఫున మళ్లీ ఆడే అవకాశం రాలేదు. అది నా మనస్సును బలంగా తాకింది. నేను టెస్ట్ జట్టులో చోటు సంపాదించాలనుకుంటున్నా. పోటీ బలంగా ఉన్నప్పటికీ.. నా సంకల్పం కూడా బలమైనదే. అన్ని ఫార్మాట్లలో చోటు సంపాదించగలను. ఇప్పుడు లక్ష్యం భారత జట్టులో తిరిగి చోటు సంపాదించమే' అని ఉనాద్కట్ అన్నాడు.
స్మిత్తో ఆడటం అదృష్టంగా భావిస్తున్నా
'కెరీర్ ప్రారంభంలోనే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్తో ఆడటం అదృష్టంగా భావిస్తున్నా. నేను అతని నాయకత్వంలో (రాజస్థాన్ రాయల్స్) ఆడినప్పుడు చాలా మద్దతు ఇచ్చాడు. నా మీద నాకు నమ్మకం ఉంది కానీ కెప్టెన్ విశ్వాసం కలిగి ఉండటం ఎంతో ముఖ్యం. అది నేను పొందా. నేను అతని కెప్టెన్సీకి పెద్ద అభిమానిని. రాజస్థాన్ ఆటగాళ్లు మైదానంలోనే కాదు, డ్రెస్సింగ్ రూమ్లో కూడా చాలా ఉల్లాసంగా ఉంటారు. నా ఆటపై నాకు నమ్మకం లేనప్పుడు బెన్ స్టోక్స్ నా వద్దకు వచ్చి సలహా ఇచ్చాడు. జోఫ్రా ఆర్చర్ కూడా సలహాలు పంచుకున్నాడు' అని ఉనాద్కట్ చెప్పుకొచ్చాడు.
సౌరాష్ట్రకు రంజీ ట్రోఫీ అందించిన ఉనాద్కట్
2019-20 సీజన్లో భాగంగా సౌరాష్ట్ర, బెంగాల్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. సౌరాష్ట్ర జట్టు తొలి ఇన్నింగ్స్లో లభించిన 44 పరుగుల ఆధిక్యం కారణంగా విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్ డ్రా అయితే.. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన జట్టుకే రంజీ ట్రోఫీ దక్కనున్న విషయం తెలిసిందే. టైటిల్ కోసం ఎన్నో ఏళ్లుగా నిరీక్షిస్తున్న సౌరాష్ట్రకు ఎట్టకేలకు ఉనాద్కట్ నేతృత్వంలోని జట్టు ట్రోఫీని అందించింది.
7 వికెట్లతో అద్భుత ప్రదర్శన
2019-20 రంజీ సీజన్లో జయదేవ్ ఉనద్కత్ బంతితో అద్భుతంగా రాణించాడు. 13.23 సగటుతో ఏకంగా 67 వికెట్లు తీశాడు. సెమీఫైనల్, ఫైనల్లో మ్యాచ్లను గెలిపించే ప్రదర్శనతో దుమ్మురేపాడు. టోర్నీ చరిత్రలో ఈ తరహాలో ఏ ఫాస్ట్ బౌలర్ రాణించలేదని గణాంకాలు చెపుతున్నాయి. ఫైనల్ మ్యాచ్ అనంతరం జయదేవ్కు పుజారా అభినందనలు తెలిపాడు. రంజీ సీజన్లో అద్భుతంగా రాణించిన ఉనద్కత్ని భారత జట్టులోకి ఎంపిక చేయాలని బీసీసీఐ సెలెక్టర్లకు సూచించాడు.