డారెన్ గంగా సరసన బుమ్రా
భారత్లో తొలి టెస్టు ఆడడానికి పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు మూడేళ్లు పట్టింది. 2018లో దక్షిణాఫ్రికా పర్యటనలో టెస్ట్ ఫార్మాట్లో అరంగేట్రం చేసిన అతడు ఎట్టకేలకు స్వదేశంలో తొలి టెస్టు ఆడుతున్నాడు. దీంతో సొంతగడ్డపై అరంగేట్రం చేసే ముందు విదేశాల్లో అత్యధిక టెస్టులు ఆడిన ప్లేయర్గా బుమ్రా నిలిచాడు. బుమ్రా కంటే ముందు వెస్టిండీస్ ప్లేయర్ డారెన్ గంగా కూడా స్వదేశం బయట 17 టెస్టులు ఆడాడు. వీళ్ల తర్వాతి స్థానంలో టీమిండియా మాజీ పేసర్ జవగళ్ శ్రీనాథ్ (12 టెస్టులు) ఉన్నాడు. ఆర్పీ సింగ్ 11, సచిన్ టెండూల్కర్ 10 టెస్టులు ఆడారు.
మూడో బౌలర్గా రికార్డు
17 టెస్టుల్లో జస్ప్రీత్ బుమ్రా 79 వికెట్లు తీసుకున్నాడు. ఇది కూడా ఓ రికార్డే. స్వదేశంలో తొలి టెస్ట్ ఆడే ముందు ఇన్ని వికెట్లు తీసిన తొలి బౌలర్ బుమ్రానే. అతని కంటే ముందు విండీస్ స్పిన్నర్ ఆల్ఫ్ వాలెంటైన్ స్వదేశంలో తన తొలి మ్యాచ్కు ముందు 65 వికెట్లు తీసుకున్నాడు. బుమ్రా ఇప్పటివరకు 17 టెస్టుల్లో 21 సగటుతో 79 వికెట్లు తీశాడు. ఇందులో 5 సార్లు 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. అంతేగాక అరంగేట్రం చేసిన ఏడాదిలోనే 8 మ్యాచ్ల్లో 48 వికెట్లతో దుమ్మురేపే ప్రదర్శనతో ఆకట్టుకున్న బుమ్రా.. ఈ ఘనత సాధించిన మూడో బౌలర్గా రికార్డుకెక్కాడు.
సిబ్లీ అర్ధ శతకం
తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ తొలి రోజు టీ విరామ సమయానికి 57 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. ఓపెనర్ డొమినిక్ సిబ్లీ (53) అర్ధ శతకంతో దూసుకెళుతుండగా.. కెప్టెన్ జో రూట్ (45) హాఫ్ సెంచరీకి చేరువయ్యాడు. లంచ్ సమయానికి 63 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయిన స్థితిలో బరిలోకి దిగిన రూట్.. సిబ్లీతో కలిసి విలువైన పరుగుల భాగస్వామ్యం (77) జోడించాడు. ఈ క్రమంలోనే జట్టును భారీ స్కోర్ దిశగా తీసుకెళుతున్నాడు.