జనవరి వరకు ఏం అడగొద్దు:
బుధవారం ముంబై నగరంలో 'పనెరాయ్' అనే వాచీ కంపెనీ ప్రచార కార్యక్రమంలో ధోనీ పాల్గొన్నాడు. క్రికెట్లో పునరాగమనంపై వచ్చే జనవరిలో నిర్ణయం తీసుకుంటానని ధోనీ తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్కు విరామం ప్రకటించడంపై ప్రశ్నలు అడగొద్దని కోరాడు. ఇదే సమయంలో ధోనీ తన క్రికెట్ కెరీర్కు సంబంధించిన రెండు అత్యుత్తమ క్షణాలను అభిమానులతో పంచుకున్నాడు.
ఆ అభిమానాన్ని నేనెప్పటికీ మరవను:
ధోనీ మాట్లాడుతూ... 'నా కెరీర్లో రెండు సంఘటనలు నా మనసుకు అత్యంత చేరువగా నిలిచాయి. 2007 టీ20 ప్రపంచకప్ గెలిచి స్వదేశం తిరిగొచ్చాం. ముంబైలో ఓపెన్ టాప్ బస్సులో ఊరేగింపు జరిగింది. ఆ సమయంలో మెరైన్ డ్రైవ్ మొత్తం పూర్తిగా నిండిపోయింది. తమ పనులన్నీ వదిలేసుకొని అభిమానులు అందరూ మా కోసం వచ్చారు. ప్రతి ఒక్కరి ముఖంలో నవ్వు కనిపించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. మాకు లభించిన స్వాగతాన్ని నేనెప్పటికీ మరవను' అని తెలిపాడు.
అలాంటివి మళ్లీ రావు:
'2011 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో విజయానికి ఇంకా 15-20 పరుగులు చేయాల్సిన సమయంలో.. మైదానంలోని అభిమానులంతా 'వందేమాతరం' నినాదాలు చేశారు. ఎంతో ఉద్వేగానికి లోనయ్యా. ఆ రెండు సంఘటనలు మళ్లీ జరుగుతాయని అనుకోను. అవి నా హృదయానికి ఎంతో దగ్గరయ్యాయి' అని ధోనీ పేర్కొన్నాడు.
పెళ్లయ్యే దాకా మగాళ్లంతా సింహాలే:
ధోనీ మాట్లాడుతూ... 'ఏ పనీచేయకుండా కూర్చునే ఉండే భర్తలకంటే నేను చాలా బెటర్. నేనొక ఆదర్శవంతమైన భర్తను. అంతకంటే ఎక్కువే అనుకుంటున్నా. నా భార్య సాక్షి ఏం చేయాలనుకున్నా తోడ్పాటు అందిస్తా. నా భార్య ఏదీ కోరినా నేను అంగీకరిస్తాను. ఎందుకంటే.. భార్యలు సంతోషంగా ఉంటేనే భర్తలు కూడా సంతోషంగా ఉంటారు. నా భార్య ఏది చెప్పినా.. నా నుంచి అవును అని సమాధానం వస్తుంది. మగాళ్లు పెళ్లి అయ్యేంత వరకే సింహాలు' అని సరదాగా పేర్కొన్నాడు.
తాత్కాలిక విరామం:
చివరిసారిగా ప్రపంచకప్ సెమీఫైనల్లో ఆడిన ధోనీ మైదానంలోకి దిగి దాదాపు ఐదు నెలలు అవుతోంది. ప్రపంచకప్ ముగిసిన అనంతరం భారత ఆర్మీలో పనిచేయాలని రెండు నెలలు క్రికెట్కు తాత్కాలిక విరామం ప్రకటించాడు. విరామం సమయం ముగిసి కూడా మరో మూడు నెలలు కావస్తున్నా.. ధోనీ భారత సెలెక్టర్లకు ఇప్పటివరకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. తాజాగా జనవరి వరకు ఏం అడగొద్దు అని తేల్చేసాడు.