

హైదరాబాద్: క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) సీఈఓ జేమ్స్ సదర్లాండ్(52) అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. గత 17 ఏళ్లుగా క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓగా కొనసాగుతున్న ఆయన బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డు, చైర్మన్కు ఆయన తన నిర్ణయాన్ని వెల్లడించారు.
సీఈఓ పదవిలో కొత్తవారిని నియమించే వరకు జేమ్స సదర్లాండ్ 12 నెలల పాటు నోటీసులో ఉండనున్నారు. 52 ఏళ్ల సదర్లాండ్ 2001లో క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓగా బాధ్యతలు అందుకున్నారు. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు క్రికెట్ ఆస్ట్రేలియాను సమర్ధవంతంగా నడిపించారు.
'సుమారు 20 ఏళ్లుగా క్రికెట్ ఆస్ట్రేలియాకు సేవలందిస్తున్నా. గుడ్బై చెప్పటానికి ఇదే సరైన సమయం. నేను తీసుకున్న ఈ నిర్ణయం నాకు, క్రికెట్ ఆస్ట్రేలియాకు మంచిదని భావిస్తున్నా' అంటూ బుధవారం ఉదయం మెల్బోర్న్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పేర్కొన్నారు.
ఎగ్జిక్యూటివ్ సెర్చ్ ఎజెన్సీ(ESA) ద్వారా నూతన సీఈవో నియామకం చేపట్టనున్నట్లు సీఏ ప్రకటించింది. అయితే కొత్తవారిని నియమించే వరకు ఆ పదవిలో కొనసాగాలని సీఏ సదర్లాండ్కు కోరింది. కాగా, 1998లో సీఏలో సభ్యుడిగా తన ప్రస్థానం కొనసాగించిన జేమ్స్ సదర్లాండ్ 2001 నుంచి సీఈఓగా కొనసాగుతున్నారు.
సదర్లాండ్ హయాంలో క్రికెట్ ఆస్ట్రేలియాలో విప్లవాత్మక మార్పులు సంభవించాయి. బోర్డు రెవెన్యూ గణనీయంగా పెరిగింది. అయితే తర్వాతి కాలంలో అదే స్థాయిలో విమర్శలు కూడా వెల్లువెత్తాయి. సెలక్షన్ కమిటీ నిర్ణయాల్లో ఆయన జోక్యం ఎక్కువైందని, ముఖ్యంగా బిగ్ బాష్ లీగ్ టోర్నీల్లో లాబీయింగ్లు చేశారని ఆయనపై ఆరోపణలు వినిపించాయి.
అయితే, ఇటీవల సఫారీ గడ్డపై ఆతిథ్య దక్షిణాఫ్రికాతో కేప్ టౌన్ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా జట్టులోని పలువురు ఆటగాళ్లు బాల్ టాంపరింగ్కు పాల్పడటంతో క్రికెట్ ఆస్ట్రేలియా ప్రతిష్ట మసకబారింది. దీంతో ఈ మధ్య నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా తీవ్ర ఒత్తిళ్లు ఎదుర్కుంటున్న జేమ్స్ సదర్లాండ్ రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.