పెర్త్ టెస్టుని ప్రతిష్టాత్మకంగా
పెర్త్ టెస్టుని ఆతిథ్య జట్టు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ జట్టు కెప్టెన్ టిమ్ పైన్ వెల్లడించాడు. రెండో టెస్టుకు ఆతిథ్యమిస్తోన్న పెర్త్ పిచ్పై అధికంగా పచ్చిక ఉండటం, ఎండ భరించలేనంత ఉండటంతో టాస్ ఓడినా ఫర్వాలేదని టిమ్ పైన్ చెప్పుకొచ్చాడు.
టాస్ ఓడినా ఫర్వాలేదు
"ఔను, టాస్ ఓడినా ఫర్వాలేదు. ఉదయమే క్యూరేటర్తో మాట్లాడా. పిచ్ మరీ విపరీతంగా స్పందిస్తుందని అనుకోను. వన్డే, టీ20ల్లో రెండు ఎండ్స్ పచ్చికతో కనిపించాయి. ప్రస్తుతం ఇక్కడున్న ఎండతో పిచ్పై కచ్చితంగా పగుళ్లు వస్తాయి. కావాల్సిందల్లా తొలిరోజు శుభారంభం లభించడం" అని టిమ్ పైన్ అన్నాడు.
రోహిత్, అశ్విన్ దూరం
మరోవైపు గాయాల కారణంగా రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ రెండో టెస్టుకు దూరమయ్యారు. వీరి స్థానంలో హనుమ విహారి, రవీంద్ర జడేజాలకు చోటు కల్పించారు. దీనిపై టిమ్ పైన్ మాట్లాడుతూ "భారత్ జట్టులోకి కొత్తవారు వచ్చారు. ఈ మార్పు గురించి మేం మాట్లాడుకున్నాం. కొన్ని వారాల క్రితమే ఆ జట్టు మొత్తం ఆటగాళ్ల బలాబలాల గురించి చర్చించాం. మ్యాచ్ గెలిచి 2-0తో సిరీస్లో ఆధిక్యం సాధించాలని కోహ్లీసేన కోరుకుంటోంది" అని అన్నాడు.
తొలి బంతి నుంచే జాగ్రత్తగా ఆడాలి
"అందుకే మేం తొలి బంతి నుంచే జాగ్రత్తగా ఆడాలి. మా క్రికెటర్లపై విశ్వాసం ఉంది. వారు పుంజుకోనేలా ప్రోత్సహిస్తున్నాం. అంతర్జాతీయ క్రికెట్లో ఫించ్ విజయవంతం అయ్యాడు. మిచెల్ స్టార్క్ రాణిస్తాడన్న నమ్మకం ఉంది. పెర్త్ పరిస్థితులు అతడికి సరిపోతాయి. కోహ్లీని తక్కువ పరుగులకే పరిమితం చేసినందుకు సంతోషంగా ఉంది. డీఆర్ఎస్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మెరుగైతే మంచిది" అని టిమ్ పైన్ అన్నాడు.