లండన్: ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా జరిగిన రెండు మ్యాచ్లలో టీమిండియా రెండు మ్యాచ్లు ఓడిపోవడంతో భారత జట్టుపై చులకన భావం ఏర్పడింది. భారత క్రికెట్ జట్టును 5-0తో వైట్వాష్ చేస్తారా.. అంటూ మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. దానికి స్పందించిన ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బెయిర్స్టో ఇప్పుడే మాట్లాడటం చాలా తొందర పాటు అవుతుందని అభిప్రాయపడ్డాడు. అయిదు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఎడ్జ్బాస్టన్, లార్డ్స్లో జరిగిన టెస్టు మ్యాచ్ల్లో టీమ్ ఇండియా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. రెండో టెస్టులో బెయిర్స్టో 93 పరుగులతో రాణించడమే కాకుండా, ఇంగ్లాండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 'పరిస్థితులు ఎప్పుడెలా ఉంటాయో తెలియదని, భారత్ ఎప్పుడైనా పుంజుకునే అవకాశాలను కొట్టిపారేయలేమన్నాడు. 'ప్రస్తుతం పరిస్థితులు మాకు అనుకూలంగా ఉన్నాయి. బహుశా స్వదేశంలో మ్యాచ్లు జరుగుతుండటం వల్ల కూడా అది కావచ్చు. అయితే, భారత్ పేలవ ప్రదర్శన చేస్తోందని అనడానికి కూడా వీల్లేదు. టీమ్ ఇండియా ఇప్పటికీ నెంబర్వన్ అని చెప్పడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇప్పుడే ఒక నిర్ణయానికి రావడానికి వీల్లేదు. ఇంకా చాలా క్రికెట్ ఉంది.' అని చెప్పుకొచ్చాడు.
'భారత్పై 5-0తో గెలవడం గురించి ఇప్పుడే మాట్లాడటం చాలా తొందరపాటు అవుతుంది. ఇప్పుడు వాతావరణం కాస్త వేడెక్కెంది. సౌత్హాంప్టన్, ఓవల్ పిచ్లు కాస్త పొడిగా ఉంటాయి. పరిస్థితులను చేజారిపోనీకుండా చూస్తాం' అని అన్నాడు. తొలి టెస్టులో వరుసగా 70, 28 పరుగులు చేసిన బెయిర్స్టో రెండో టెస్టులో 93 పరుగులు చేసి కొద్దిలో శతకం చేజార్చుకున్నాడు. భారత్-ఇంగ్లాండ్ల మధ్య మూడో టెస్టు ఈనెల 18న ట్రెంట్ బ్రిడ్జ్లో జరగనుంది.
ముగిసిన రెండు టెస్టుల్లోనూ టీమిండియా వైఫల్యాలను చవిచూసింది. మొదటి మ్యాచ్లో 31 పరుగుల తేడాతో ఓడిన టీమిండియా.. రెండో మ్యాచ్లో ఏకంగా 159 పరుగులతో పరాజయం పాలైంది. అయితే జరిగిన రెండు టెస్టుల్లోనూ బ్యాట్స్మెన్ విఫలమైయ్యారు. తొలి టెస్టులో కోహ్లీ సెంచరీ, హాఫ్ సెంచరీ పూర్తి చేసి 200 పరుగులు చేయగలిగాడు.