
హైదరాబాద్: జీవితంలో ఎప్పుడూ ఏం జరుగుతుందో చెప్పలేం. ఓ సారి అనుకూలంగా ఉండొచ్చు.. మరోసారి ప్రతికూలంగా ఉండొచ్చు. దీనికి క్రికెట్ కూడా అతీతమేం కాదు. ముఖ్యంగా ఆరాధ్యా దైవంగా భావించే భారత్లో యువ ఆటగాళ్లకు ఇది సరిగ్గా సరిపోతుంది. ఒక్క మంచి ప్రదర్శన స్టార్ను చేస్తే.. ఒక్క వైఫల్యం జీరోను చేస్తుంది. ఇక న్యూజిలాండ్తో జరిగిన చివరి టీ20లో టీమిండియా యువ క్రికెటర్ సంజూ శాంసన్ పరిస్థితి కూడా దాదాపు ఇదే.
ఈ ఐదు టీ20 సిరీస్లో తొలి మూడు మ్యాచ్లు అవకాశం కోసం ఎదురు చూసిన అతను.. చివరి రెండు మ్యాచ్ల్లో వచ్చిన అవకాశాన్ని 6,2తో చేజేతులా చేజార్చుకున్నాడు. అయితే చివరి టీ20లో బ్యాటింగ్లో ఘోరంగా విఫలమైన అతను తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నాడు. కానీ శాంసన్ అద్భుత ఫీల్డింగ్.. అతని వైఫల్యాన్ని మరిచిపోయేలా చేసింది. యావత్ క్రీడాలోకాన్ని సంభ్రమశ్చార్యానికి లోనుచేసింది.
ఇక సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ ప్రతీ అంశంపై స్పందించే బిజినెస్ టైకూన్, మహీంద్రా గ్రూఫ్ చైర్మన్ ఆనంద్ మహీంద్రాను కూడా అతని ఫీల్డింగ్ విన్యాసం ఆకర్షించింది. సంజూ ఫీల్డింగ్కు ముగ్దుడైన ఆయన ఈ వారం తన స్క్రీన్ సేవర్ ఈ మైమరిపించే ఫీల్డింగ్ విన్యాసమేనని ట్వీటర్ వేదికగా తెలిపారు.
'ఈ పిక్ గురించి భారత్లో కానీ, న్యూజిలాండ్లో కానీ వివరణ ఇవ్వాల్సిన వస్తుందనుకోవడంలేదు. ఈ వారం నా స్క్రీన్సేవర్ ఇదే. సోమవారం ఇంతకంటే స్పూర్తిని కలిగించే అంశం మరొకటి లేదు' అని ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేశారు.
ఇక కివీస్ ఇన్నింగ్స్ సందర్భంగా శార్థుల్ ఠాకుర్ వేసిన 8వ ఓవర్ చివరి బంతిని రాస్ టేలర్ స్వీప్ చేస్తూ మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్ ఆడాడు. ఆ షాట్ దాదాపు సిక్స్ అని అందరూ భావించారు. కానీ అక్కడే బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సంజూ.. సూపర్ మ్యాన్లా గాల్లోకి ఎగిరి బంతినందుకున్నాడు. అయితే బ్యాలెన్స్ కోల్పోయిన అతను బౌండరీ లైన్ బయట పడుతున్నానని గమనించి తన కాళ్ల సందులో నుంచి బంతి మైదానంలోకి విసిరేసాడు. దీంతో సిక్సర్ కాస్త రెండు పరుగులుగానే మారింది. ఇక శాంసన్ బంతిని అడ్డుకున్నా ఫోరైనా కావచ్చని అందరూ భావించారు. కానీ రిప్లేలో చూసే సరికి శాంసన్ అద్భుత ఫీల్డింగ్ సంభ్రమాశ్చర్యానికి గురించేసింది.