రంజీ ట్రోఫీలో చాంపియన్గా
ఇటీవల జరిగిన రంజీ ట్రోఫీలో చాంపియన్గా నిలవడంతో మరోమారు రెస్టాఫ్ ఇండియాతో ఇరానీకప్లో విదర్భకు తలపడే అవకాశం దక్కింది. రెస్టాఫ్ ఇండియా నిర్దేశించిన 280 పరుగుల లక్ష్యఛేదన కోసం ఆఖరి రోజు ఓవర్నైట్ స్కోరు 37/1తో ఆట కొనసాగించిన విదర్భ 5 వికెట్లకు 269 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ను కొనసాగించిన విదర్భ జట్టు ఆదిలోనే కెప్టెన్ ఫైజ్ ఫజాల్ వికెట్ను కోల్పోయింది.
పరుగులేమీ చేయకుండా ఫజాల్ నిష్క్రమణ
ఫజాల్ పరుగులేమీ చేయకుండా నిష్క్రమించడంతో ఆదిలోనే వికెట్ కోల్పోయింది. ఆ సమయంలో సంజయ్ రఘనాథ్(42), అథర్వా తైడే(72)లు 116 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆపై గణేశ్ సతీష్(87) హాఫ్ సెంచరీతో ఆకట్టుకోగా, మోహిత్ కాలే(37) ఫర్వాలేదనిపించాడు. విదర్భ ఐదో వికెట్గా గణేశ్ సతీష్ వికెట్ను కోల్పోయిన తర్వాత ఇరు జట్ల కెప్టెన్లు మ్యాచ్ని డ్రాకు అంగీకరించారు.
తొలి ఇన్నింగ్స్లో 425 పరుగులు
విదర్భ తన తొలి ఇన్నింగ్స్లో 425 పరుగులు చేయగా, రెస్టాఫ్ ఇండియా తన మొదటి ఇన్నింగ్స్లో 330 పరుగులు చేసింది. ఇక రెస్టాఫ్ ఇండియా రెండో ఇన్నింగ్స్ను 374/3 వద్ద డిక్లేర్డ్ చేసింది. దాంతో తొలి ఇన్నింగ్స్లో ఆధిక్యంలో నిలిచిన విదర్భను విజేతగా ప్రకటించారు. 2018 ఇరానీకప్లో కూడా తొలి ఇన్నింగ్స్ ఆధారంగానే విదర్భ టైటిల్ను గెలవడం విశేషం.
|
అక్షయ్ కర్నెవార్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు
సెంచరీతో రాణించిన అక్షయ్ కర్నెవార్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. విజేతగా తమకు వచ్చిన ప్రైజ్మనీని పుల్వామాలో మరణించిన జవాన్ల కుటుంబాలకు విరాళమిస్తున్నట్లు విదర్భ కెప్టెన్ ఫయాజ్ ఫజల్ ప్రకటించాడు.
సంక్షిప్త స్కోర్లు:
రెస్టాఫ్ ఇండియా: 330, 374/3 డిక్లేర్డ్; విదర్భ తొలి ఇన్నింగ్స్ 425; రెండో ఇన్నింగ్స్: 269/5 (గణేశ్ సతీష్ 87, అధర్వ టైడ్ 72; చాహర్ 2/116, అంకిత్ రాజ్పుత్ 1/41).