హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 11వ సీజన్ గాయాల బెడద వదలట్లేదు. గాయాల కారణంగా ఇప్పటికే పలువురు క్రికెటర్లు టోర్నీకి దూరమైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలోకి మరో ఆటగాడు చేరాడు. కోల్కతా నైట్రైడర్స్ ఆటగాడు కమలేశ్ నాగర్కోటి గాయం కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ మొత్తం టోర్నీకి దూరమయ్యాడు.
ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్|ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్
ఈ ఏడాది జనవరిలో జరిగిన ఐపీఎల్ వేలంలో కోల్కతా జట్టు రూ.3.2 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ ఏడాది ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్లో అద్భుత ప్రదర్శన చేసిన ఈ యువ పేసర్ కోసం పలు ఫ్రాంఛైజీలు పోటీపడ్డాయి. అయితే చివరకు అతడిని కోల్కతా దక్కించుకుంది. నిజానికి టోర్నీ ప్రారంభం ముందు నుంచీ నాగర్కోటి గాయంతో బాధపడుతున్నాడు.
టోర్నీ ప్రారంభం తర్వాత అతడు కోలుకుంటాడని భావించిన కోల్కతా జట్టుకు నిరాశే ఎదురైంది. గాయం కారణంగా కమలేశ్ నాగర్కోటి ఈ ఏడాది ఐపీఎల్ పూర్తి సీజన్కు దూరమైనట్లు ఆ జట్టు యాజమాన్యం శనివారం అధికారికప్రకటన చేసింది. అంతేకాదు అతడి స్థానంలో కర్ణాటక ఆటగాడు ప్రసిద్ క్రిష్ణన్ను తీసుకుంటున్నట్లు వెల్లడించింది.
టోర్నీలో భాగంగా కోల్కతా తన తదుపరి మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడనుంది. ఈ సీజన్ ప్రారంభానికి ముందే కోల్కతా నైట్రైడర్స్కు ఊహించని షాక్ తగిలిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు.
జోహెన్స్బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగే నాలుగో టెస్టు ముందు మిచెల్ స్టార్క్ కుడికాలికి గాయమైంది. మరోవైపు చెన్నైకి చెందిన కేదార్ జాదవ్ కూడా గాయం కారణంగా ఐపీఎల్ మొత్తం టోర్నీకి దూరమయ్యాడు. అదే జట్టుకు చెందిన మరో ఆటగాడు సురేశ్ రైనా గాయపడటంతో చెన్నై జట్టు ఆడబోయే తదుపరి రెండు మ్యాచ్లకు దూరమయ్యాడు.