ఆరంభం అదిరింది:
టాస్ ఓడి మొదటగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. రాజస్థాన్ జట్టుకు ఓపెనర్లు బట్లర్, రహానేలు మంచి ఆరంభమే ఇచ్చారు. దీపక్ చహర్ తొలి ఓవర్లో బట్లర్.. ఫోర్, సిక్సర్ బాదాడు. సాన్ట్నర్ వేసిన రెండో ఓవర్లో రహానే.. రెండు వరుస బౌండరీలు కొట్టాడు. అయితే రాహుల్ చాహర్ వేసిన మూడో ఓవర్ ఐదో బంతికి రహానే (14) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు.
6 ఓవర్లు.. 54/3:
శార్థూల్ ఠాకూర్ వేసిన ఆ తర్వాతి ఓవర్లో బట్లర్ (23) వరుసగా మూడు ఫోర్లు బాది ఊపుమీద కనిపించాడు. ఇదే ఊపులో ఆ తర్వాతి బంతికి భారీ షాట్కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. మిషెల్ శాంట్నర్ వేసిన ఆరో ఓవర్ రెండో బంతికి శాంసన్ (6) కూడా పెవిలియన్ చేరాడు. 6 ఓవర్లలో రాజస్తాన్ 3 వికెట్ల నష్టానికి 54 పరుగులు చేసింది.
గోపాల్, ఆర్చర్ విజృంభణ:
ఆ తర్వాత రాహుల్ త్రిపాఠి (10).. స్టీవ్ స్మిత్ (15)లు జడేజాకు చిక్కి పెవిలియన్ చేరారు. ఈ సమయంలో స్టోక్స్, పరాగ్ జట్టును ఆదుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో స్టోక్స్ (28) దీపక్ చాహర్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. పరాగ్ (16) ఠాకూర్ బౌలింగ్లో నిష్క్రమించాడు. ఇన్నింగ్స్ చివర్లో గోపాల్ (7 బంతుల్లో 19 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్), ఆర్చర్ (12 బంతుల్లో13 నాటౌట్; 1 ఫోర్)లు ధాటిగా ఆడడంతో.. రాజస్థాన్ 151 పరుగుల సాధారణ స్కోర్ చేసింది. చెన్నై బౌలర్లలో చాహర్, ఠాకూర్, జడేజా తలా రెండు వికెట్లు తీశారు.
ఆదిలోనే షాక్ :
152 పరుగుల లక్ష్యంతో దిగిన చెన్నైకి ఆదిలోనే షాక్ తగిలింది. తొలి ఓవర్ వేసిన ధావళ్ కులకర్ణి వాట్సన్ను డకౌట్ చేశాడు. రెండో ఓవర్లో రైనా (4) రనౌటయ్యాడు. అనంతరం మరో ఓపెనర్ డుప్లెసిస్ (7)ను ఉనాద్కట్ ఔట్ చేయడంతో.. చెన్నై 15 పరుగులకే టాపార్డర్ను కోల్పోయింది. అయితే రాయుడు మాత్రం క్రీజులో నిలబడ్డాడు. ఇక స్టోక్స్ అద్భుతమైన క్యాచ్కు జాదవ్ (1) బలయ్యాడు. పవర్ ప్లేలో చెన్నై 4 వికెట్లకు 24 పరుగులే చేసి ఓటమి దిశగా సాగింది.
రాయుడు, ధోనీ అర్ధ సెంచరీలు:
ఈ దశలో క్రీజులోకి వచ్చిన చెన్నై కెప్టెన్ ధోనీ.. రాయుడుకు అండగా నిలిచాడు. ధోనీ పదో ఓవర్లో సిక్సర్ కొట్టడంతో చెన్నై 50 పరుగుల మార్క్ అందుకుంది. ధోని అడపాదడపా సిక్సర్లతో జట్టును నడిపించాడు. ఇదే సమయంలో రాయుడు కూడా వేగం పెంచడంతో.. స్కోర్ బోర్డు ముందుకు కదిలింది. ఈ క్రమంలో రాయుడు అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక 30 బంతుల్లో చెన్నై విజయానికి 51 పరుగులు చేయాలి. 16వ ఓవర్లో గోపాల్ 5 పరుగులు.. 17వ ఓవర్లో ఆర్చర్ 7 పరుగులే ఇచ్చారు. ఇక 18వ ఓవర్ వేసిన స్టోక్స్ 9 పరుగులిచ్చి.. రాయుడును అవుట్ చేసాడు. జడేజా క్రీజులోకి రాగా.. ధోనీ 39 బంతుల్లో అర్ధ సెంచరీ చేశాడు.
ఆఖరి ఓవర్లో ఉత్కంఠ:
ఆఖరి ఓవర్లో 18 పరుగులు చేయాల్సి రాగా.. తొలి బంతిని జడేజా సిక్సర్గా మలిచాడు. రెండో బంతి నోబాల్ వేయగా.. జడేజా ఓ పరుగు చేశాడు. ఇక 5 బంతుల్లో 10 పరుగులు చేయాలి. మూడో బంతికి ధోనీ 2 పరుగులు చేశాడు. కానీ ఆ తర్వాతి బంతికి క్లీన్బౌల్డ్ అయ్యాడు. ఐదో బంతికి సాన్ట్నర్ రెండు పరుగులు చేశాడు. ఇక చివరి బంతికి నాలుగు పరుగులు అవసరం కాగా.. స్టోక్స్ వైడ్ వేశాడు. అదనంగా వచ్చిన బంతిని శాంట్నర్ సిక్స్ కొట్టేసి చెన్నైకి సంచలన విజయం అందించాడు.