
హైదరాబాద్: రెండేళ్ల నిషేధం తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 11వ సీజన్లోకి రాజస్థాన్ రాయల్స్ ఘనంగా పునరాగమనం చేయబోతుంది. జనవరి 27, 28 తేదీల్లో బెంగళూరులో వేలం ముగిసినప్పటి నుంచి రాజస్థాన్ ఫ్రాంచైజీ తనదైన స్టైల్ను ఫాలో అవుతుంది.
ఐపీఎల్ ప్రారంభం కావడానికి ఇంకా రెండు నెలలు ఉండగా... ఇటీవల ముంబైలో అందరి కన్నా ముందు జట్టు సభ్యులతో ప్రాక్టీస్ కూడా నిర్వహించి ఆశ్చర్యపరచింది. ఇప్పుడు ఆ జట్టు కెప్టెన్ ఎవరనే విషయాన్ని టెలివిజన్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చెబుతామని పేర్కొంది.
ఈ మేరకు స్టార్స్ స్పోర్ట్స్తో కలిసి శనివారం ఐపీఎల్ 11వ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుని నడిపించేదెవరో అభిమానులతో పంచుకోనుంది. ఈ తరహాలో ఓ ఫ్రాంఛైజీ తమ కెప్టెన్ను ప్రకటించడం ఐపీఎల్ చరిత్రలోనే ఇదే తొలిసారి కావడం విశేషం.
ఐపీఎల్ 11వ సీజన్ కోసం రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ను మెంటార్గా నియమించుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఐపీఎల్ 11వ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ను ఎంపిక చేసే బాధ్యత షేన్ వార్న్ తీసుకున్నాడు.
ఈ సందర్భంగా షేన్ వార్న్ మాట్లాడుతూ 'వివిధ దేశాలకు చెందిన ఆటగాళ్లు జట్టులో ఉన్న నేపథ్యంలో కెప్టెన్ పాత్ర కీలకం. అందరినీ ఒకేతాటిపై నడిపించాల్సిన బాధ్యత అతనికుంది. మైదానం లోపల, బయట జట్టులో మంచి సంస్కృతిని సృష్టించడంలో అతడు సాధనంగా ఉపయోగపడతాడు' అని అన్నాడు.
'బెన్ స్టోక్స్, రహానె, స్టీవ్ స్మిత్లో మంచి నాయకత్వ లక్షణాలున్నాయి. జోస్ బట్లర్లో కూడా టీమ్ను నడిపించే సామర్థ్యం ఉంది' అని షేన్ వార్న్ పేర్కొన్నాడు. స్టార్స్పోర్ట్స్ నెట్వర్క్లో Phir Halla Bol - Return of the Royals అనే కార్యక్రమం ద్వారా కొత్త కెప్టెన్ ఎవరనే విషయాన్ని శనివారం రాజస్థాన్ వెల్లడించనుంది.
ఏయే ఛానెల్స్లో ఈ కార్యక్రమాన్ని వీక్షించొచ్చు:
Star Sports 1, Star Sports HD 1, Star Sports Hindi 1, Star Sports Hindi 1 HD and
Star Sports First at 7:00 pm IST