హైదరాబాద్: డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్... ఢిల్లీ క్యాపిటల్స్తో బదిలీ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా ముంబై ఇండియన్స్కు చెందిన లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండేను ఢిల్లీ క్యాపిటల్స్కు ఇచ్చి, ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు షెర్ఫేన్ రూథర్ఫోర్డ్ని ముంబై జట్టులోకి తీసుకుంది.
గత కొన్ని సంవత్సరాలుగా ముంబై ఇండియన్స్ జట్టు యువ ఆటగాళ్లకు మంచి అవకాశాలను కల్పిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం టీమిండియాకు ఆడుతోన్న హార్ధిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రాలు అలా వెలుగులోకి వచ్చివారే. తాజా బదిలీతో 20 ఏళ్ల షెర్ఫేన్ రూథర్ఫోర్డ్కి మంచి భవిష్యత్తు ఉండబోతోంది.
ప్రో కబడ్డీ 7వ సీజన్ వార్తలు, పాయింట్ల పట్టిక కోసం క్లిక్ చేయండి
ఈ బదిలీ ఒప్పందపై ముంబై ఇండియన్స్ ఓనర్ ఆకాశ్ అంబానీ మాట్లాడుతూ "మయాంక్ భవిష్యత్తు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాం. మయాంక్ ఒక అద్భుతమైన ప్రతిభ కలిగిన క్రికెటర్. మేము అతనిని ప్రారంభంలో గుర్తించి, పోషించడం అదృష్టం. ఇది మాకు చాలా కష్టమైన నిర్ణయం, కాని మేము మంచి క్రికెట్ అవకాశాల కోసం మయాంక్ను విడుదల చేస్తున్నాం" అని తెలిపాడు.
"మయాంక్ భారత క్రికెట్లో మరో మెరిసే స్టార్గా ఎదగాలని కోరుకుంటున్నాం. అతను ఎప్పుడూ ముంబై ఇండియన్స్ కుటుంబంలో ఒక సభ్యుడిగానే ఉంటాడు. ఇక, ప్రతిభావంతుడైన షెర్ఫేన్ను ముంబై ఇండియన్స్ కుటుంబంలోకి స్వాగతిస్తున్నందుకు సంతోషిస్తున్నాను. షెర్ఫేన్ తన ఆల్ రౌండ్ స్కిల్స్, మ్యాచ్-విన్నింగ్ వైఖరి ఎంతగానో ఆకట్టుకున్నాయి. తన కెరీర్ యొక్క ప్రారంభ దశలో ప్రపంచవ్యాప్తంగా అతను చేసిన ప్రదర్శన అద్భుతం. ముంబై ఇండియన్స్ జట్టుని తన ఇల్లులాగా భావిస్తాడని మేము నమ్ముతున్నాం" అని ఆకాశ్ అంబానీ తెలిపాడు.
ఈ ఏడాది ముగిసిన ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో సరైన స్పిన్నర్ లేని కారణంగా ఫైనల్స్కు అర్హత సాధించలేకపోయింది. మయాంక్ మార్కండేతో స్పిన్నర్ లేని లోటు తీరడంతో పాటు ఢిల్లీ బౌలింగ్ లైనప్ మరింత పటిష్టం కానుంది. ఇప్పటికే ఆ జట్టులో కగిసో రబాడ, ఇషాంత్ శర్మ వంటి క్వాలిటీ పేసర్లు ఉన్న సంగతి తెలిసిందే.