హైదరాబాద్: ఇండియన్ క్యాష్ రిచ్ లీగ్ టోర్నీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అరుదైన ఘతనను సొంతం చేసుకుంది. ఐపీఎల్ ప్రారంభమైన కొన్ని ఏళ్లకే ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందడంతో పాటు కోట్ల సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకుంది.
అంతేకాదు ఐపీఎల్ సక్సెస్ను చూసి పలు క్రికెట్ బోర్డులు తమ దేశాల్లో ఇలాంటి టీ20 టోర్నీలనే మొదలుపెట్టారు. అలాంటి ఐపీఎల్ గురించి ఈ ఏడాది ఏప్రిల్లో ఎక్కువగా వెతికారు. ఈ మేరకు సెర్చింజన్ ఆప్టిమైజేషన్, సెర్చ్ అనలిటిక్స్ సాఫ్ట్వేర్ సెమ్రష్ ప్రకటించింది.
ప్రతీ ఏడాదికి ఐపీఎల్ అభిమానులను మరింతగా పెంచుకుంటూనే ఉంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అభిమానుల సంఖ్య మరింతగా పెరిగింది. ఈ ఏడాది గూగుల్లో అత్యధికులు వెతికిన పదంగా ఓ అధ్యయనంలో తేలింది. మ్యాచ్ల సమాచారం కోసం ఐపీఎల్ అన్న పదాన్ని 180 కోట్ల సార్లు ఉపయోగించి వెతికారంట.
సెర్చ్ అనలిటిక్స్ సాఫ్ట్వేర్ సెమ్రష్ నిర్వాహకులు చేపట్టిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. 'గతేడాది ఏప్రిల్లో ఐపీఎల్ పదాన్ని8,23,000 సార్లు వినియోగించగా, ఈ ఏడాది అది గణనీయంగా పెరిగింది. ఈ ఫలితాలు చూసి మేమే ఆశ్చర్యపోయాం. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో 180 కోట్లసార్లు ఐపీఎల్ పదం ఉపయోగించి నెటిజన్లు కావాల్సిన సమాచారం కోసం వెతికారు' అని తెలిపారు.
ఇందులో ఐపీఎల్కు సంబంధించి 22 లక్షల 52 వేల కీ వర్డ్స్ కూడా ఉన్నట్లు సెమరష్ పేర్కొంది. ఈ సంఖ్య 2017 ఏప్రిల్లో 8.23 లక్షలు ఉండగా ఏడాది వ్యవధిలోనే రెట్టింపు కావడం గమనార్హం. కాగా, ఐపీఎల్ 11వ సీజన్ తుది దశకు చేరుకుంది. టోర్నీలో భాగంగా ఆదివారం ముంబైలోని వాంఖడె స్టేడియంలో హైదరాబాద్-చెన్నై జట్లు తలపడనున్నాయి.