ముంబై: టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంఛైజీ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టులోనే కొనసాగనున్నాడు. ఇదే విషయాన్ని పంజాబ్ సహ యజమాని నెస్ వాడియా తాజాగా ఓ ప్రకటనలో తెలిపారు. అయితే అశ్విన్ పంజాబ్ జట్టులోనే కొనసాగడానికి అసలు కారణం ఇటీవల కింగ్స్ ఎలెవన్ పంజాబ్ హెడ్ కోచ్గా ఎంపికైన అనిల్ కుంబ్లే అని సమాచారం తెలుస్తోంది. పంజాబ్ జట్టుకు బాలీవుడ్ హీరోయిన్ ప్రీతి జింటా కూడా సహ యజమాని.
దక్షిణాఫ్రికాతో మూడో టెస్టు.. హర్భజన్ రికార్డు బద్దలు కొట్టనున్న అశ్విన్!!
అశ్విన్ ఐపీఎల్ 2019 సీజన్లో కెప్టెన్గా విజయవంతం కాలేదు. సీజన్ ఆరంభంలో జట్టును విజయాల బాట పట్టించిన అశ్విన్.. టోర్నీ జరుగుతున్నా కొద్ది తన మార్క్ చూపించలేకపోయాడు. దీంతో కెప్టెన్సీ మార్పుతో పాటు అశ్విన్ని కూడా వదులుకోవాలని పంజాబ్ ఫ్రాంఛైజీ భావించింది. ఈ క్రమంలో అతడ్ని ఢిల్లీ క్యాపిటల్స్కి ఇచ్చేందుకు సిద్దమయింది. అంతేకాదు అశ్విన్ ధరలో మరో ఇద్దరు ఆటగాళ్లని తీసుకోవలనుకుంది.
కానీ ఇటీవల పంజాబ్ హెడ్ కోచ్గా ఎంపికైన అనిల్ కుంబ్లే.. పంజాబ్ జట్టు నిర్ణయాన్ని వ్యతిరేకించాడు. అశ్విన్కి అనిల్ కుంబ్లే మద్దతుగా నిలవడంతో జట్టు యజమానులు తమ ఆలోచనని విరమించుకున్నారు. దీంతో అశ్విన్ పంజాబ్ జట్టులోనే కొనసాగనున్నాడు. అయితే అతడికి సారధ్య భాద్యతలు ఇస్తారో లేదో చూడాలి. లీగ్ ఆరంభం నుండి చెన్నై సూపర్ కింగ్స్కు ఆడిన అశ్విన్.. 2018, 2019 సీజన్లలో పంజాబ్ జట్టుకు ఆడాడు. అశ్విన్ కెప్టెన్సీలో గత ఏడాది పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచిన పంజాబ్.. ఈ ఏడాది ఆరో స్థానంతో సరిపెట్టుకుంది.
పంజాబ్ సహ యజమాని నెస్ వాడియా మాట్లాడుతూ.. 'అశ్విన్ బదిలీ విషయంపై పంజాబ్ ఫ్రాంచైజీ పునరాలోచించింది. అశ్విన్ జట్టులో ఒక భాగమని గ్రహించాం. సీనియర్ స్పిన్నర్ అయిన అతడు జట్టులోనే కొనసాగుతాడు. అశ్విన్ బదిలీపై ఢిల్లీ క్యాపిటల్స్తో చర్చలు జరిపాం. కానీ అవి ఫలించలేదు. అశ్విన్ సత్తా ఏంటో అతని రికార్డులే చెప్తున్నాయి' అని తెలిపాడు.