
హైదరాబాద్: ఐపీఎల్ దేశీవాలీ ట్రోఫీ మాత్రమే కాదు. అంతర్జాతీయ క్రికెటర్లకు సైతం మంచి కెరీర్ను ఇచ్చిందని క్రికెట్ దిగ్గజం సచిన్ కొనియాడారు. సింగపూర్ వేదికగా జరుగుతున్న 'హెచ్టీ మింట్ ఆసియా సమిట్'లో సచిన్ పాల్గొన్నారు. ఇందులో మీడియా ప్రతినిధులు అడిగిన పలు అంశాలకు సమాదానలిచ్చారు.
ఇందులో భాగంగానే, ఐపీఎల్ ఎందరో యువ క్రికెటర్లకు అవకాశం కల్పిస్తోందని సచిన్ టెండూల్కర్ అన్నారు. భారత క్రికెటర్లకు మాత్రమే ఇది దోహదం చేయడం లేదని.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెటర్లందరికీ ఎంతో సహాయపడుతోందని పేర్కొన్నారు. కొద్ది రోజుల ముందు వరకు క్రికెట్ లో ఎక్కడ చూసినా బ్యాల్ ట్యాంపరింగ్ గురించి చర్చే అలాంటిది ఐపీఎల్ రాగానే అంతా మర్చిపోయారు.
'అంతర్జాతీయ క్రికెట్ మాదిరిగా ఐపీఎల్ కూడా ఎంతో కఠినమైనది, పోటీ తత్వంతో కూడుకున్నది. ఐపీఎల్ భారత ఆటగాళ్లకు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్లర్లకు ఎంతగానో ఉపయోగపడుతోంది. ఐపీఎల్ ఆడిన అనుభవంతోనే ఇతర దేశాల ఆటగాళ్లు భారత పర్యటనకు వస్తున్నారు. భారత్కు, అంతర్జాతీయ క్రికెట్కు ఐపీఎల్ ఎంతో ఇచ్చింది' అని సచిన్ అన్నారు.
సచిన్ను మీరెప్పుడూ ఇంత కూల్ గా ఉంటారు. మీకు కోపం రాదా అని అడిగిన ప్రశ్నకు ఉపయోగం లేని కోపం దేనికి అనే అర్థంతో సమాధానమిచ్చారు. అయినా కొన్నిసార్లు ఒత్తిడిని కలిగి ఉండటం కూడా మంచిదేనని, మన నుంచి ఉత్తమ ఫలితాలను బయటకు వచ్చేలా దోహదపడుతుందని సచిన్ అన్నారు.
ఐపీఎల్లో ఆటగాళ్లతో పాటు అంపైర్లపై కూడా బాధ్యత పెరిగిందని తెలిపారు. అంపైర్లు పాత్ర చాలా ఒత్తిడితో కూడుకున్నదని, కానీ వాళ్లు సాధ్యమైనంతవరకు సంయమనం పాటిస్తూనే ఉంటారని కొనియాడారు. ఇప్పుడు ఐపీఎల్లో ఆడుతున్న అంపైర్లలో చాలా మంది మాజీ ఆటగాళ్లేనని.. వారికి ఆట ఒత్తిడి ఏంటో తెలుసని సచిన్ వివరించారు.