ధోనీని మించిన కెప్టెన్ ఎవరూ లేరు:
వేలం అనంతరం పియూష్ చావ్లా తన స్వస్థలమైన మొరాదాబాద్ (ఉత్తర్ ప్రదేశ్) నుండి ఓ జాతీయ మీడియాతో మాట్లాడాడు. 'వేలంలో చెన్నై జట్టు కొనుగోలు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఏ ఆటగాడైనా గొప్ప కెప్టెన్ నాయకత్వంలో మంచి జట్టులో ఆడాలని కోరుకుంటాడు. నాకు ఆ అవకాశం దక్కింది. సీఎస్కే కంటే గొప్ప జట్టు, మహీ భాయ్ని మించిన మరో నాయకుడు ఉండడు. ఇంతకంటే ఎక్కువ ఆశించను' అని చావ్లా అన్నాడు.
చోటు కోసం ఆలోచించట్లేదు:
'సీఎస్కేలో హర్భజన్ సింగ్, ఇమ్రాన్ తాహిర్, రవీంద్ర జడేజా వంటి టాప్ స్పిన్నర్లు ఉన్నారు. తుది జట్టులో చోటు కోసం ఇప్పటి నుంచే ఆలోచించట్లేదు. చెపాక్ స్టేడియం పెద్ద మైదానం కాబట్టి నా బౌలింగ్ శైలి జట్టుకు ఉపయోగపడుతుంది. గత 12 ఏళ్లుగా చెన్నైలో క్లబ్ క్రికెట్ను ఆడుతున్నాని చాలా మందికి తెలియదు. గత వేలంలో సీఎస్కే వద్ద నా బిడ్ ఆగిపోయింది. కానీ.. కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) రైట్ టు మ్యాచ్ కార్డ్ను ఉపయోగించుకొని సొంతం చేసుకుంది' అని చావ్లా పేర్కొన్నాడు.
అందుకే వదిలిలేసుకున్నారు:
'కోల్కతా ప్రాంచైజీతో సంబంధాలు బాగానే ఉన్నాయి. ఎలాంటి విభేదాలు లేవు. మాములుగా ఈడెన్గార్డెన్స్ పిచ్ స్పిన్నర్లకు అంతగా అనుకూలించదు. దీంతో కేకేఆర్ ప్రాంఛైజీ పేసర్లపై దృష్టి సారించింది. జట్టులో ముగ్గురు నాణ్యమైన స్పిన్నర్లు అవసరం లేదని వారు భావించారు. అందుకే నన్ను వదిలిలేసుకున్నారు' అని చావ్లా తెలిపాడు. ప్రస్తుతం నాకు 30 ఏళ్లు. అయినా రంజీల్లో ఆడుతున్నా. క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. టీమిండియాలో ఆడే అవకాశం రావాలని రాసి పెట్టి ఉంటే అదే వస్తుంది అని చెప్పుకొచ్చాడు.
కేవలం నలుగురే!!
పియూష్ చావ్లా టీమిండియా తరఫున 3 టెస్టులు, 25 వన్డేలు, ఏడు టీ20లు ఆడాడు. ఈ వేలంలో చావ్లాతో పాటు సామ్ కరన్ (5.5 కోట్లు), హేజిల్వుడ్ (2 కోట్లు), సాయి కిశోర్ (రూ. 20 లక్షలు)ను కూడా చెన్నై తీసుకుంది. ఈ వేలంలో తక్కువ మంది ఆటగాళ్లను తీసుకుంది కేవలం చెన్నై జట్టు మాత్రమే. చెన్నై చాలా మంది ఆటగాళ్లను అట్టిపెట్టుకోవడంతో ఆ జట్టుకు పెద్దగా ఆటగాళ్లను తీసుకునే అవకాశం లేకపోయింది.