చెన్నై సూపర్ కింగ్స్
ఐపీఎల్లో అన్ని జట్లలోకెల్లా ఎక్కువ పేరు సంపాందించిన జట్టు ఏదైనా ఉందంటే అది చెన్నై సూపర్ కింగ్స్ మాత్రమే. రెండేళ్ల పాటు నిషేధానికి గురైన 11వ సీజన్లో అడుగుపెడుతోంది. చెన్నై జట్టుకు ఇంత ఫాలోయింగ్ రావడానికి కారణం టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. కాగా, జనవరి 4న జరిగిన ప్లేయర్ రిటెన్షన్ ప్రాసెస్లో ఆ జట్టు స్టార్ ఆటగాళ్లు అయిన మహేంద్ర సింగ్ ధోని, సురేశ్ రైనా, రవీంద్ర జడేజాలను అట్టిపెట్టుకుంది. ఈ సీజన్లో చెన్నై యాక్షన్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
రాజస్థాన్ రాయల్స్
చెన్నైలాగే రాజస్థాన్ రాయల్స్ జట్టు కూడా రెండేళ్ల పాటు నిషేధాన్ని ఎదుర్కొని ఫ్రెష్గా ఐపీఎల్ 2018లో అడుగుపెడుతోంది. ప్లేయర్ రిటెన్షన్ ప్రాసెస్లో భాగంగా ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ను రాజస్థాన్ రాయల్స్ జట్టు అట్టిపెట్టుకుంది. 2008లో ఐపీఎల్ తొలి సీజన్ విజేతగా నిలిచిన రాజస్థాన్ రాయల్స్ ఆ తర్వాతి సీజన్లలో మెరుపులు మెరిపించింది. 27, 28 తేదీల్లో జరిగే వేలంలో కొత్త టాలెంట్ను జట్టులో చేర్చాలని ఫ్రాంచైజీ భావిస్తోంది.
ముంబై ఇండియన్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదేళ్ల సీజన్లో అత్యంత విజయవంతమైన జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది. రోహిత్ శర్మ కెప్టెన్గా ఉన్న ముంబై ఇండియన్స్ జట్టు మూడు సార్లు ఐపీఎల్ విజేతగా అవతరించింది. రోహిత్ శర్మకు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించిన తర్వాత ఆ జట్టు అద్భుత ప్రదర్శన చేస్తోంది. ఐపీఎల్ తొలి నాళ్లలో సచిన్ టెండూల్కర్, సనత్ జయసూర్య లాంటి క్రికెట్ దిగ్గజాలు ఈ జట్టు తరుపునే ఆడారు. తొలి నాలుగు సీజన్లలో ముంబై ఇండియన్స్ విజేతగా నిలవడంలో విఫలమైంది. 2011లో రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ జట్టులో చేరిన తర్వాత కొత్త ఉత్సాహాం జట్టులో చేరింది. 2013లో కెప్టన్సీ బాధ్యతలు అందుకున్న రోహిత్ శర్మ 2015, 2017లో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ విజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
జనవరి 4న జరిగిన ఐపీఎల్ ప్లేయర్ రిటెన్షన్ ప్రాసెస్లో విరాట్ కోహ్లీకి రూ. 17 కోట్లు చెల్లించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అట్టిపెట్టుకుంది. తద్వారా ఐపీఎల్ 2018లో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో అత్యంత ప్రజాదరణ కలిగిన జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒకటి. అయితే ఒక్కసారి కూడా ఐపీఎల్ విజేతగా నిలవలేదు.
కోల్కతా నైట్ రైడర్స్
ఐపీఎల్ తొలి నాళ్లలో జట్టు కాస్త ఇబ్బంది పడినప్పటికీ, రెండుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచింది. టీమిండియా వెటరన్ క్రికెటర్ గౌతం గంభీర్కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పిన తర్వాత జట్టుని సరైన దిశలో నడిపించాడు. అయితే ఐపీఎల్ 2018లో గంభీర్ను వేలానికి వదిలేసింది. దీంతో ఐపీఎల్ 11వ సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు కొత్త కెప్టెన్ రాబోతున్నాడు.
సన్రైజర్స్ హైదరాబాద్
డెక్కన్ ఛార్జర్స్ను తొలగించిన తర్వాత 2013లో ఐపీఎల్లోకి సన్రైజర్స్ హైదరాబాద్ వచ్చి చేరింది. 2016లో జరిగిన ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుని జట్టుని ఓడించి ఐపీఎల్ విజేతగా నిలిచింది. జనవరి 4న జరిగిన ఐపీఎల్ ప్లేయర్ రిటెన్షన్ ప్రాసెస్లో కెప్టెన్ డేవిడ్ వార్నర్తో పాటు పేసర్ భువనేశ్వర్ కుమార్ని సన్ రైజర్స్ హైదరాబాద్ అట్టిపెట్టుకుంది. గతేడాది వేలంలో ఆప్ఘనిస్థాన్ స్పిన్నర్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరుపున అద్భుత ప్రదర్శన చేశాడు. దీంతో వేలంలో ఆ జట్టు ఆటగాళ్లు అయిన శిఖర్ ధావన్, రషీద్ ఖాన్లను తిరిగి దక్కించుకునేందుకు రైట్ టు మ్యాచ్ కార్డులను ఉపయోగించొచ్చు.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్
ఐపీఎల్ ఆరంభ సీజన్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు తరుపున యువరాజ్ సింగ్, బ్రెట్ లీ, శ్రీశాంత్ ఆటగాళ్లు ఆడారు. దీంతో టైటిల్ ఫేవరేట్లలో ఒకటిగా నిలిచింది. అయితే జట్టుగా సమిష్టి ప్రదర్శన చేయడంలో పంజాబ్ జట్టు విఫలమైంది. అయితే 2014లో జట్టు సారథ్య బాధ్యతలను ఆస్ట్రేలియా జట్టు ఆటగాడు జార్జి బెయిలీకి అప్పగించిన తర్వాత అద్భుత ప్రదర్శన చేసింది. ఆ ఏడాది ఫైనల్కు కూడా చేరుకుంది. అయితే ఫైనల్లో కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో ఓటమి పాలై రన్నరప్గా నిలిచింది. ఆ తర్వాతి జరిగిన సీజన్లలో పంజాబ్ జట్టు 8వ స్థానానికే పరిమితమైంది.
ఢిల్లీ డేర్ డెవిల్స్
ఈ జట్టులో టీ20 గతిని మార్చగలిగే ఆటగాళ్లు ఉన్నప్పటికీ అదృష్టం కలిసిరాదు. ఐపీఎల్ ప్రారంభ సీజన్లో వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్, డేవిడ్ వార్నర్ లాంటి విధ్వంసకర ఆటగాళ్లు ఢిల్లీ తరుపునే ఆడారు. అయితే జట్టుగా ఆడటంలో ఢిల్లీ ఎప్పుడూ విఫలమవతూనే ఉంటుంది. అభిమానుల అంచనాలను కూడా అందుకోలేకపోతుంది. పదేళ్ల ఐపీఎల్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ ఒకే ఒక్కసారి మాత్రమే ఫైనల్కు చేరింది. 2012లో జరిగిన ఫైనల్లో కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో ఓటమి పాలైంది. కాగా, ఐపీఎల్ 2018 సీజన్లో ఢిల్లీ జట్టు శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, క్రిస్ మోరిస్లను అట్టిపెట్టుకుంది. ఢిల్లీ డేర్ డెవిల్స్ బ్యాటింగ్ కోచ్గా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ను ఎంచుకుంది.