న్యూఢిల్లీ: ఐపీఎల్ 2023 సీజన్ నిర్వహణకు బీసీసీఐ సిద్దమవుతోంది. ఇప్పటికే రిటెన్షన్ ప్రక్రియను పూర్తి చేసిన బీసీసీఐ.. డిసెంబర్ 23న కేరళలోని కొచ్చి వేదికగా మినీ వేలం నిర్వహించనుంది. ఈ మినీ వేలానికి 991 మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకోగా.. ఇందులో 714 మంది భారతీయులు ఉండగా.. 277 మంది ఓవర్సీసీ ప్లేయర్లు ఉన్నారు. ఇందులో నుంచి గరిష్టంగా 87 మంది ప్లేయర్లకు అవకాశం దక్కనుంది. ఈ ధనాధన్ లీగ్ ఆడేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెటర్లంతా ఆసక్తికనబరుస్తుంటే.. టీమిండియా స్టార్ ప్లేయర్లు చతేశ్వర్ పుజారా, హనుమ విహారిలు మాత్రం ఈ మినీ వేలానికి దూరంగా ఉన్నారు.
ఈ ఇద్దరూ టెస్ట్ ప్లేయర్లు ఐపీఎల్ 2023 మినీ వేలానికి రిజస్టర్ చేసుకోలేదని టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఐపీఎల్ 2021 సీజన్లో రూ.50 లక్షల కనీసం ధరకు చతేశ్వర్ పుజారాను చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. కానీ ఆ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా అతనికి అవకాశం ఇవ్వలేదు. ఐపీఎల్ 2022 సీజన్ కోసం జరిగిన మెగా వేలంలో మాత్రం పుజారాను చెన్నై పట్టించుకోలేదు. పుజారా చివరిసారిగా 2014లో ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు. గత రెండు సీజన్లలో వేలంలో కోటీ కనీస ధరతో వేలంలో పాల్గొన్న హనుమ విహారీని ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు. అతను చివరిసారిగా సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున 2019లో ఆడాడు.
మినీ వేలం కావడం.. ఫ్రాంచైజీల దగ్గర తక్కువ డబ్బు ఉండటంతో పాటు యువ ఆటగాళ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో వేలంలో పాల్గొనకపోవడమే మంచిదని ఈ టెస్ట్ స్పెషలిస్ట్లు భావించినట్లు తెలుస్తోంది. వేలంలో పాల్గొని అమ్ముడుపోని జాబితాలో మిగిలి పరువు పోగొట్టుకోవడం కంటే దూరంగా ఉండటమే మంచిదని పుజారా, విహారి నిర్ణయించుకున్నట్లు వారి సన్నిహితులు పేర్కొన్నారు.
మినీ వేలానికి రిజిస్టర్ చేసుకున్న 991 మంది ఆటగాళ్లను దాదాపుగా 200కు షార్ట్ లిస్ట్ చేయనున్నారు. డిసెంబర్ 9లోపు వేలంలో పాల్గొనే ఆటగాళ్ల తుది జాబితాను సిద్దం చేసి ఫ్రాంచైజీలకు అందజేయనున్నారు. టీ20 ప్రపంచకప్ 2022లో సత్తా చాటిన బెన్ స్టోక్స్, సామ్ కరన్, కామెరూన్ గ్రీన్ వంటి ఆటగాళ్లకు భారీ ధర పలికే అవకాశం ఉంది.