ముంబై: ఐపీఎల్ 2022 సీజన్కు మరికొద్ది క్షణాల్లో తెరలేవనుంది. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైడ్ రైడర్స్తో జరిగే మ్యాచ్తో ధనాధన్ లీగ్ ప్రారంభం కానుంది. అయితే ఈ సారి కూడా ఆరంభ వేడుకలు లేకుండా ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభం కానుంది. అయితే ఆరంభ వేడుకలకు బదులు టోక్యో ఒలింపిక్స్ 2020లో మువ్వెన్నల జెండాను రెపరెపలాడించిన భారత ఆథ్లెట్లను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఘనంగా సత్కరించనుంది. ఈ విషయమై ఇదివరకే ఒలింపిక్ విజేతలకు ఆహ్వానాలు పంపింది.
భారత జావెలిన్ త్రోయర్, టోక్యో ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రాతో పాటు రెజ్లర్లు బజరంగ్ పూనియా (కాంస్యం), రవి దాహియా (రజతం), వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను (రజతం), బాక్సర్ లవ్లీనా బోర్గోహెయిన్ (కాంస్యం), షట్లర్ పీవీ సింధు (కాంస్యం), భారత పురుషుల హాకీ జట్టు సభ్యులు (కాంస్యం) ఈ ప్రత్యేక కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. వీరిలో బల్లెం వీరుడు నీరజ్ చోప్రా కు సత్కారంతో పాటు కోటి రూపాయల నజరానా కూడా ఇవ్వనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. మార్చి 26న ముంబైలోని వాంఖడేలో ప్రారంభమయ్యే ఐపీఎల్ 2022 ఆరంభ మ్యాచ్కు ముందు టోక్యో ఒలింపిక్స్ విజేతల సన్మాన కార్యక్రమం జరుగనున్నట్లు తెలుస్తోంది.
ముంబైలోని వాంఖడే స్టేడియంలో సీఎస్కే, కేకేఆర్ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఈ వేడుకలు జరగనున్నాయి. ఇక 2008 నుంచి 2018 వరకు పదేళ్లపాటు ఐపీఎల్ ప్రారంభ వేడుకలను ఘనంగా నిర్వహించారు. 2019లో భారత సైనికులపై ఉగ్రదాడి (పూల్వామా మారణకాండ) జరిగిన నేపథ్యంలో వారి మృతికి సంతాపంగా ఆరంభ వేడుకలలు నిర్వహించలేదు. ఆ డబ్బులను డగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాలకు అందజేశారు. ఇక 2020, 2021 సీజన్లలో కరోనా కారణంగా ఆరంభ వేడుకలు నిర్వహించలేదు. ఈసారి కూడా అదే కారణంతో వేడుకులకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.