ముంబై: ఐపీఎల్ 2022 సీజన్ సెకెండ్ హాఫ్ రసవత్తరంగా సాగుతోంది. అయిదు పరాజయాల తరువాత కోల్కత నైట్రైడర్స్ తొలి మ్యాచ్ గెలిచింది. తన పరాజయాల పరంపరకు తెర దించింది. సోమవారం రాత్రి వాంఖెడె స్టేడియంలో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ను ఓడించింది. ఈ టోర్నమెంట్లో కోల్కతకు ఇది నాలుగో గెలుపు. ఇప్పటివరకు 10 మ్యాచ్లల్లో శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలోని ఈ జట్టు గెలిచింది నాలుగే. పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోందీ టీమ్.
కోల్కత నైట్రైడర్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్న రింకూ సింగ్ బ్యాక్గ్రౌండ్ ఆసక్తికరం.. విషాదమయం కూడా. అతనిది దిగువ మధ్య తరగతి కుటుంబం. ఉత్తర ప్రదేశ్లోని అలీగఢ్ రింకూ సింగ్ స్వస్థలం. రెండు గదులు ఉన్న ఓ చిన్న క్వార్టర్లో నివాసం తొమ్మిదిమంది కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటోన్నాడు. తల్లిదండ్రులు, చెల్లెలు, అన్న జీతూసింగ్, చెల్లెలు నేహాసింగ్, వదిన, వారి పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు.
తండ్రి ఖన్చంద్ది గ్యాస్ సిలిండర్లను డోర్ డెలివరి చేసే ఉద్యోగం. తల్లి వీణా దేవి గృహణి. జీతూసింగ్ ఆటోడ్రైవర్. చిన్నప్పటి నుంచే క్రికెట్ పట్ల ఆసక్తిని పెంచుకున్నాడు. డొమెస్టిక్ క్రికెట్ ఆడాలనే బలమైన కోరికతో ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. సచిన్ టెండుల్కర్, సురేష్ రైనా అతని ఆరాధ్య క్రికెటర్లు. కుటుంబాన్ని పోషించడానికి తండ్రి పడే కష్టంలో తానూ పాలుపంచుకునేవాడు. దీనికోసం ఒకదశలో ఓ ప్రైవేట్ కార్యాలయంలో స్వీపర్గా కొద్దిరోజులు పని చేశాడు. ఆటోడ్రైవర్గానూ కష్టపడ్డాడు.
పెద్దగా చదువుకోలేదు. తొమ్మిదో తరగతిలోనే చదువును మానేశాడు. స్కూల్ డ్రాపౌట్ స్టూడెంట్ అతను. 2018లో ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చాడు. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీలకు ఎంపికయ్యాడు గానీ పెద్దగా మ్యాచ్లను ఆడే అవకాశం రాలేదు. మెగా వేలంపాట సందర్భంగా 80 లక్షల రూపాయలకు అతణ్ని జట్టులోకి తీసుకుంది కోల్కత నైట్రైడర్స్. దీనితో అతని దశ తిరిగిపోయింది. ఓవర్నైట్ స్టార్డమ్ను సొంతం చేసుకున్నాడు.
ఈ సీజన్లో ఇప్పటివరకు మూడు మ్యాచ్లను ఆడాడు. వందకు పైగా స్ట్రైక్ రేట్తో 35, 23, 42 (నాటౌట్) పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేయాలని, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలవాలని నిర్ణయించుకున్నాడు. దాన్ని చేతి మీద రాసుకుని మరీ క్రీజ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అనుకున్నది సాధించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అతనికే సొంతమైంది. ఇలాంటి అవకాశం కోసం తాను అయిదు సంవత్సరాలుగా ఎదురు చూశానని చెప్పాడు. లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానని పేర్కొన్నాడు.