165 పరుగులకు కట్టడి చేసినా..
తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కత నైట్రైడర్స్ 165 పరుగులు చేసింది. ఓపెనర్లు వెంకటేష్ అయ్యార్-43, అజింక్యా రహానే-25, నితీష్ రాణా-43 రాణించారు. ముంబై బౌలర్ జస్ప్రీత్ బుమ్రా విజంభణతో స్కోర్ మందగించింది. మిడిల ఆర్డర్లో రింకూ సింగ్-23 మినహా మరెవరూ భారీ స్కోర్ చేయలేకపోయారు.
ఆరుమంది బ్యాటర్లు సింగిల్ డిజిట్ నమోదు చేశారు. ఈ సీజన్లో తొలిసారిగా బుమ్రా ప్రత్యర్థులను భయపెట్టాడు. నాలుగు ఓవర్లల్లో 10 పరుగులు మాత్రమే ఇచ్చి అయిదు వికెట్లు తీసుకున్నాడు. ఆ స్కోర్ను ఛేదించలేక ముంబై చతికిల పడింది. 52 పరుగుల తేడాతో ఓడింది.
బ్యాటింగ్ నిరాశపరిచింది..
మ్యాచ్ ముగిసిన అనంతరం రోహిత్ శర్మ మాట్లాడాడు. ఇలాంటి పిచ్లపై గెలిచిన సందర్భాలు ఉన్నాయని, టార్గెట్ను ఛేదించగలమనే భావించానని అన్నాడు. నాలుగు మ్యాచ్లు ఆడినందు వల్ల డీవై పాటిల్ స్టేడియం పిచ్పై తమకు అవగాహన ఉందని, అంచనాలు తలకిందలయ్యాయని చెప్పాడు. బ్యాటింగ్ తీరు తనను నిరాశకు గురి చేసిందని వ్యాఖ్యానించాడు.
తమ ఇన్నింగ్లో భారీ భాగస్వామ్యం కరవు కావడం మ్యాచ్ పరాజయానికి కారణమైందని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు.
200 పరుగులు చేస్తారనుకున్నా..
సెకెండ్ హాఫ్లో బౌలింగ్ డిపార్ట్మెంట్ గాడిన పడిందని చెప్పాడు. ప్రత్యేకించి- జస్ప్రీత్ బుమ్రాకు ఇది ప్రత్యేకమైన రోజు అని కితాబిచ్చాడు. ఈ పిచ్పై తన అంచనాలకు అనుగుణంగానే పేసర్లు సత్తా చాటారని అన్నాడు. తొలి 10 ఓవర్లల్లో వంద పరుగులు చేసిన కోల్కత బ్యాటర్లు, ఆ తరువాత కూడా అదే స్థాయిలో ఆడొచ్చని అంచనా వేశానని వ్యాఖ్యానించాడు.
బౌలర్లు బౌన్స్బ్యాక్ అయిన తీరు అద్భుతమని పేర్కొన్నాడు. బుమ్రా సహా బౌలింగ్ యూనిట్ మొత్తం సత్తా చాటిందని ప్రశంసించాడు. కాగా- ముంబై ఇండియన్స్కు ఇంకో మూడు మ్యాచ్లు మిగిలివున్నాయి. తన తదుపరి మ్యాచ్ను చెన్నై సూపర్ కింగ్స్తో ఆడనుంది. అనంతరం సన్రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ కేపిటల్స్తో తలపడుతుంది.