ముంబై: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాట్స్మెన్లకు అనూహ్యమైన ఆఫర్ లభించింది. కోట్ల రూపాయల కనక వర్షం వారిపై కురువబోతోంది. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న స్పోర్ట్స్ బ్రాండ్ ప్యూమా వారిద్దరితో వాణిజ్యపరమైన ఒప్పందాలను కుదుర్చుకుంది. ప్యూమా బ్రాండ్ అంబాసిడర్లుగా వారిని నియమించింది. జర్మనీకి చెందిన స్పోర్ట్స్ బ్రాండ్ కంపెనీ ప్యూమా.. రాయల్ ఛాలెంజర్స్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్, డాషింగ్ ఓపెనర్ దేవ్దత్ పడిక్కల్లతో ఈ మేరకు అగ్రిమెంట్ చేసుకుంది.
ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ కేప్టెన్ విరాట్ కోహ్లీ, పంజాబ్ కింగ్స్ స్కిప్పర్ కేఎల్ రాహుల్ ఈ సంస్థ కాంట్రాక్ట్లో కొనసాగుతున్నారు. వారి ఉత్పత్తులకు ప్రచారకర్తగా ఉన్నారు. యువరాజ్ సింగ్కు కూడా ఆ కంపెనీతో అగ్రిమెంట్స్ ఉన్నాయి. అలాగే- మహిళా క్రికెటర్ సుష్మా వర్మతోనూ ప్యూమా ఇదివరకే ఒప్పందం కుదుర్చుకుంది. దేవ్దత్ పడిక్కల్ గత ఏడాది ఐపీఎల్ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో కలిశాడు. ఆ సీజన్లో నిలకడగా రాణించాడు.
వాషింగ్టన్ సుందర్ పరిస్థితీ అంతే. పైగా అంతర్జాతీయ ఫార్మెట్లోనూ అతను తన శక్తి సామర్థ్యాలను నిరూపించుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లో సుందర్ ఏ రేంజ్లో ఆడాడో ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. వాషింగ్టన్ సుందర్, దేవ్దత్ పడిక్కల్ ప్యూమా స్పోర్ట్స్ బ్రాండ్ దృష్టిని ఆకర్షించారు. ఫరెవర్ ఫాస్టర్ స్పిరిట్ అనే నినదానికి వారిద్దరూ సరిగ్గా సరిపోతారని ప్యూమా ఇండియా, సౌత్ ఈస్ట్ ఆసియా విభాగం మేనేజింగ్ డైరెక్టర్ అభిషేక్ గంగూలీ అన్నారు.
స్టార్ హోదా ఉన్న ఆటగాళ్లతోనే కాకుండా యువతరం క్రికెటర్లను ప్రోత్సహించడంలో భాగంగా తాము దేవ్దత్ పడిక్కల్, వాషింగ్టన్ సుందర్లతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు చెప్పారు. యంగ్ స్టర్స్ను ప్రోత్సహించాలన్నదే తమ అభిమతమని చెప్పారు. మున్ముందు మరింతమంది యంగ్ క్రికెటర్లతో ఎండార్స్మెంట్ కుదుర్చుకుంటామని స్పష్టం చేశారు. ఆర్సీబీకి చెందిన ఆ ఇద్దరు యంగ్స్టర్స్తో స్పోర్ట్స్ అగ్రిమెంట్స్ కుదుర్చుకోవడం తమ బ్రాండ్స్కు మరింత ప్రచారం లభిస్తుందని చెప్పారు.